కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్ చుక్ ను ఆస్పత్రిలో చేర్పించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేంద్రవిద్యాశాఖమంత్రి రాజీనామా చేయాలని 17 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ మరో రెండు రోజులే బతికే అవకాశం ఉందని వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్పించాలని, బలవంతంగా ఆహారం ఇవ్వాలని కోరుతూ రాజ్ కుమార్ అనే లాయర్ పిటిషన్ వేశారు.
వాంగ్ చుక్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఒకవేళ ఆయన చనిపోతే దేశానికి, ప్రపంచానికి అవమానం అవుతుందని పిటిషన్ లో తెలిపారు. ఢిల్లీ హైకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని పిటిషన్లో కోరారు . ఇవాళ(జూలై 15) హైకోర్టులో విచారణకు రానుంది.
ప్రభుత్వం వాంగ్చుక్ను నేరస్థుడి గా, ఉగ్రవాది గా దేశద్రోహి గా చూస్తోందని పిటిషనర్ ఆరోపించారు. వాంగ్చుక్ నిరాహార దీక్షపై ప్రభుత్వం ఇప్పటివరకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు.
ఆమిర్ ఖాన్ ' 3 ఇడియట్స్ ' చిత్రంలోని ఫున్సుఖ్ వాంగ్డు పాత్రకు స్ఫూర్తినిచ్చిన వాంగ్చుక్.. నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహించిన నిరసనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం అభిజిత్ దీప్కే ప్రారంభించిన వ్యంగ ఉద్యమంలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ..విద్యా సంస్కరణలు, పేపర్ లీక్ల తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది.
