ఈ పెద్దాయన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్. బాగా చదువుకున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్గా ఏళ్ల కొద్దీ అనుభవం గడించారు. కానీ.. ఏం లాభం "హలో... నేను దివ్య" అని వాట్సాప్లో ఒక తెలియని నంబర్ నుంచి మెసేజ్ రాగానే స్పందించకుండా ఉండలేకపోయారు.
ఆ తర్వాత.. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి తనను తాను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా పరిచయం చేసుకుని ఈ పెద్దాయనను మాటల్లోకి దించి.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.21 కోట్లు కాజేసి పెద్దాయనకు జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చారు. ఈ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ పేరు అశోక్ విజయవర్గియా. చిన్నాచితకా ఉద్యోగి కాదు.
మధ్యప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA), చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్. ఇంత ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న విజయ వర్గియా కూడా సైబర్ క్రైం బాధితుడిగా మిగిలిపోక తప్పలేదు. రూ.21 కోట్ల మోసం జరిగిందని సైబర్ క్రైంలో ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసుల కంటే మోసగాళ్లు ఒక అడుగు ముందే ఉన్నారు. దోచుకున్న డబ్బునంతటినీ క్రిప్టోలోకి మార్చేశారు. రూ. 2 కోట్లను మాత్రమే సైబర్ క్రైం కేటుగాళ్ల బారిన పడకుండా స్తంభింపజేయగలిగారు.
►ALSO READ | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాపై సుప్రీం ఆగ్రహం.. రూ.10 లక్షల జరిమానా !
దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్పందించే లోపే.. మిగిలిన డబ్బును ఇతర అకౌంట్లకు తరలించడం, వీలైనంత విత్ డ్రా చేయడం, మార్పిడి చేయడం, ఇతర చెల్లింపులకు వాడటం చేసేశారు. గ్వాలియర్కు చెందిన ఈ 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి రూ. 21.06 కోట్లు కొల్లగొట్టి, ఆ డబ్బును దేశవ్యాప్తంగా ఉన్న వేలాది బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సైబర్ క్రైం పోలీసులకు ఈ కేటుగాళ్లు పెద్ద సవాలే విసిరారు.
విజయ వర్గియా నుంచి ఈ సైబర్ మోసగాళ్లు దోచుకున్న సొమ్ము రూ. 21 కోట్ల 59 లక్షల 2 వేల రూపాయలు. కొట్టేసిన ఈ డబ్బుతో 20 వేలకు పైగా డిజిటల్ లావాదేవీలు జరిపారు. సుమారు 12 వేల 700 బ్యాంకు ఖాతాలలోకి ఈ డబ్బును మళ్లించి సైబర్ క్రైం పోలీసులకు ఈ సైబర్ నేరగాళ్లు ఛాలెంజ్ విసరడం గమనార్హం.
