హైదరాబాద్.వెలుగు : చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అద్దెకు ఇస్తున్న ఏపీకి చెందిన నెష్నూర్ శిరీష్ కుమార్(38) ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తిరుపతికి సిరీష్ కుమార్ సైబర్ నేరస్తులతో కలిసి ఆన్లైన్ ప్రొడక్ట్స్ రేటింగ్స్, టాస్క్ లు, అడ్వర్టైజ్మెంట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నాడు.
టాస్క్ లతో తక్కువ మొత్తంలో కమీషన్లు ఇస్తూ నమ్మిస్తున్నారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇదంతా చైనా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేస్తున్నారు. వారికి ఇండియన్ అకౌంట్స్ను అందించేందుకు శిరీష్ కుమార్ సహకరించడమే కాకుండా పలుమార్లు చైనాకు వెళ్లి వచ్చాడు.
వాట్సప్, టెలీగ్రామ్ ద్వారా టాస్క్ పేరిట..
చైనీస్ డెవలప్ చేసిన యాప్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, గేమింగ్, టాస్క్ పేరుతో జరిగే మోసాల్లో డబ్బు అంతా ఇలాంటి ఫేక్ అకౌంట్స్లోనే డిపాజిట్ అవుతున్నది. వీటిలో సిరీష్ క్రిమినల్స్ కు ఇచ్చిన ఓ బ్యాంక్ అకౌంట్లో రూ.1.5 కోట్లకుపైగా డబ్బు డిపాజిట్ అయ్యింది. ఇప్పటికే శిరీష్ అకౌంట్పై దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్కు చెందిన వ్యక్తి వాట్సప్, టెలీగ్రామ్ ద్వారా టాస్క్ పేరుతో మోసం చేశారు. బాధితుడి అకౌంట్ నుంచి రూ.60 లక్షలు కొట్టేశారు. ఆ డబ్బు సిరీష్ అకౌంట్లో డిపాజిట్ అయ్యింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అకౌంట్ నంబర్ను గుర్తించారు. చైనీస్కి అకౌంట్లకు అందించినట్లు ఆధారాలు సేకరించారు. శిరీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.