బషీర్బాగ్, వెలుగు: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న అంశంపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు బాలగోని బాల్రాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి మోసం చేశారని విమర్శించారు. కో-కన్వీనర్లు వెంకన్న, విజయ్కుమార్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్ విడుదలైతే, మరుసటి రోజునుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫ్రంట్ నేతలు బైరి శేఖర్, అంబాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
