
చెన్నై: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల స్పోర్ట్స్ ఆగిపోయాయి. దాదాపు నెల రోజుల నుంచి ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమవగా.. జర్మనీకి చెందిన ప్రముఖ ఫుల్బాల్ లీగ్ బండెస్లీగా వచ్చే నెలలో తమ సీజన్ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఖాళీ స్టేడియంలో జరగబోయే ఈ లీగ్.. కరోనా వచ్చిన తర్వాత తిరిగి మొదలయ్యే తొలి టోర్నీ కానుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తగ్గితే మనదేశంలోనూ ఖాళీ స్టేడియాల్లో పోటీలను పున:ప్రారంభించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్, ఫుట్బాల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, బీసీసీఐ, ఆలిండియా ఫుట్బాల్ఫెడరేషన్ (ఎఐఎఫ్ఎఫ్) మాత్రం ఖాళీ స్టేడియాల్లో ఆటకు నో అంటున్నాయి. జర్మనీకి ఇండియాకు చాలా తేడా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ అన్నాడు. ‘జర్మనీలో సోషల్ రియాలిటీకి ఇండియాకు చాలా డిఫరెన్స్ఉంది. సమీప భవిష్యత్తులో ఇండియాలో క్రికెట్ ఉండదు. ఇప్పుడు చాలా విషయాల్లో అనేక అడ్డంకులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలకు రిస్క్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ అవసరం ఉండదని నేను నమ్ముతా’ అని దాదా స్పష్టం చేశాడు. ఇక, ఇండియాలో టాప్ క్రికెటర్ల క్రేజ్ స్టేడియాలకు మాత్రమే పరిమితం కాదని హర్భజన్ సింగ్ అన్నాడు.
‘ఐపీఎల్ టీమ్స్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎయిర్ పోర్ట్స్, హోటల్స్, స్టేడియాల బయట చాలా మంది ప్రజలు ఉంటారు. సోషల్ డిస్టెన్స్మెయింటేన్ చేయడం కోసం వారందరినీ ఎలా కంట్రోల్ చేస్తారు? అందువల్ల కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మ్యాచ్లు నిర్వహించొద్దు’ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించినా కూడా తమకు అభ్యంతరం లేదని బ్రాడ్కాస్టర్ అంటున్నా.. ఈ సమయంలో అలా చేయడం బాగుండదని సీఎస్కే ఫ్రాంచైజీ సీఈవో కేఎస్ విశ్వనాథన్ అన్నారు.
అనుమతిస్తే చాన్స్ వదలొద్దు: భుటియా
ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్పై నీలినీడలు కమ్ముకోగా.. ఇండియా ఫుట్బాల్ టీమ్ మాజీ కెప్టెన్ బైచుంగ్భుటియా మాత్రం మరో వాదన వినిపిస్తున్నాడు. కరోనా తగ్గిన వెంటనే… ఫ్యాన్స్లేకున్నా ఫుట్బాల్ను స్టార్ట్ చేయాలని అంటున్నాడు. ‘ఇప్పుడు టీవీలో టెలీకాస్ట్ చేసేందుకు స్పోర్ట్స్ ఏమీ లేవు. ఇలాంటి టైమ్లో ఎక్కువ మంది వీవర్లను ఆకట్టుకునేందుకు ఇండియా ఫుట్బాల్కు ఇది మంచి అవకాశం. క్రైసిస్ ఉన్నప్పుడు స్పోర్ట్ను స్టార్ట్ చేయాలని నేను అనడం లేదు. కానీ, ఎమ్టీ స్టాండ్స్లో ఆటకు గవర్నమెంట్ అనుమతిస్తే మాత్రం ఆ చాన్స్ను మిస్సవకూడదు’ అని భుటియా అభిప్రాయపడ్డాడు. అయితే, ఏఐఎఫ్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా దత్తా మాత్రం.. భుటియాతో విభేదించారు. ‘ఎమ్టీ స్టాండ్స్లో నిర్వహించినా.. టీవీ సిబ్బంది, జర్నలిస్టులు సహా స్టేడియంలో కనీసం వంద మంది ఉంటారు. వారిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు ఉండవు అనడానికి గ్యారంటీ ఏమిటి? ఏదైనా జరిగితే స్టేడియం మొత్తాన్ని సీజ్ చేస్తారు. అలాగే ఇండియన్ ఫుట్బాల్కు అభిమానులే ప్రాణదాతలు అన్న విషయం మర్చిపోకూడదు. టిక్కెట్ల విక్రయం కూడా ఇక్కడ ముఖ్యమైనదే’ అని అన్నారు.