బీసీ కులవృత్తుల ఎగ్జిబిషన్ సక్సెస్..5 రోజుల్లో 20 వేల మంది విజిట్

బీసీ కులవృత్తుల ఎగ్జిబిషన్ సక్సెస్..5 రోజుల్లో 20 వేల మంది విజిట్

హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐదు రోజుల బీసీ కుల వృత్తుల ఎగ్జిబిషన్ ఆదివారంతో ముగిసింది. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం పక్కన హెచ్ఎండీఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఈనెల 25న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. 

మట్టిపాత్రలు, మేదరివారు తయారు చేసిన వెదురు వస్తువులు, పూసలవారి సామగ్రి, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట మొదలైన చేనేత ఉత్పత్తులు, గౌడన్నల ‘నీరా' స్టాల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తం 30 స్టాల్స్ ఏర్పాటు చేయగా ఐదు రోజుల్లో 20 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్ నిర్వహకుడు, ఎంబీసీ కార్పొరేషన్ సీఈవో అలోక్ కుమార్ తెలిపారు.

 బీసీ చేతివృత్తుల వారి పర్యావరణ హితమైన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించేందుకు ప్రభుత్వం ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇక్కడికి వచ్చిన చేతివృత్తుల వారికి ఉచితంగా స్టాల్ ఇవ్వడంతో పాటు వసతి భోజన సదుపాయాలు కల్పించామన్నారు. ఏటా ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయాలని వృత్తి కళాకారుల నుంచి వస్తున్న అభ్యర్థనను ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

చేతి వృత్తులకు చేయూత నిచ్చారు

సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు. చేతివృత్తుల వారికి చేయూత నిచ్చారు. ఇంకా ఇలాంటి ప్రదర్శనలు చాలా ఏర్పాటు చేయాలని కోరుతున్నం.

- నర్సింహ, మేదరి కళాకారుడు, నారాయణపేట-

మట్టి ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది

మట్టి గణపతులు, రాఖీలు చేసేందుకు బీసీ కార్పొరేషన్ శిక్షణ ఇచ్చింది. ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అందించే అవకాశం వచ్చింది. మట్టి వస్తువులకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. 

‌‌ - ధనలక్ష్మి, వర్షిణి, కుమ్మరి కళాకారులు, సంగారెడ్డి -

తాటి ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నం

తాటి ఆకులతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నం. ఐదు దశాబ్దాలుగా వేల మందికి శిక్షణ ఇచ్చాను. ఇప్పుడు మార్కెటింగ్ కల్పించడం ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి అవకాశం ఇవ్వలేదు.

- కేబీటీ సుందరి, తాటి ఉత్పత్తుల ట్రైనింగ్ హెడ్-