తెలంగాణలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి: భట్టీ విక్రమార్క

తెలంగాణలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టండి: భట్టీ విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో మెట్రో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టండని.. అవసరమైన భూమి, ఇతర వనరులు, సహకారాలను ప్రభుత్వ పక్షాన అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు అన్నారు. ఫిబ్రవరి 29వ తేదీ గురువారం సచివాలయంలో BEML (భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్) కంపెనీ సీఎండి శంతను రాయ్ బృందంతో డిప్యూటీ సీఎం సమావేశం అయ్యారు. BEML కంపెనీ బేస్ ఎక్కడ, ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు, ఉత్పత్తులు సృష్టిస్తుందో ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. మెట్రో రైల్ కోచ్ లు, రక్షణ, మైన్స్ వంటి రంగాల్లో తమ కంపెనీ పని చేస్తుందని సిఎండి శంతను రాయ్ డిప్యూటీ సీఎం వివరించారు. 

బెంగళూరు కేంద్రంగా తమ కంపెనీ పని చేస్తుందని.. రక్షణ రంగానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్డ్ లో,   సింగరేణిలో ఎర్త్ మూవర్స్ రంగాల్లో పనిచేస్తున్నట్టు వివరించారు.  హైదరాబాదులో ప్రాంతీయ కార్యాలయం ఉన్నట్టు తెలిపారు. హైదరాబాదులో మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు శంతను రాయ్  తెలిపారు. మెట్రో కోచ్ ఫ్యాక్టరీల తయారీలో ఇతర కంపెనీలకు BEMLకు  ఉన్న తేడా ఏంటి?... ధరలు, నాణ్యత వంటి అంశాల్లో మీకు ఉన్న ప్రత్యేకత ఏంటో కంపెనీ లెటర్ పై వివరించాలని భట్టి చెప్పారు. 

హైదరాబాద్ సిటీ తో పాటు రాష్ట్రంలోని వాతావరణం, వనరులను పరిశీలించండి, త్వరలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక సమావేశం పెట్టి మెట్రో రంగానికి సంబంధించిన మీ కంపెనీ ఆసక్తులను సమగ్రంగా చర్చిద్దామని తెలిపారు డిప్యూటీ సీఎం.