వందలాది మందిని కాపాడిన 12ఏళ్ల బాలుడు.. ఎలాగంటే..

వందలాది మందిని కాపాడిన 12ఏళ్ల బాలుడు.. ఎలాగంటే..

పశ్చిమ బెంగాల్‌లోని 12 ఏళ్ల బాలుడు వందలాది మంది ప్రాణాలను రక్షించాడు. డ్యామేజ్ అయిన రైల్వే ట్రాక్ ను గమనించిన అతను.. తన ఎర్రటి టీ-షర్టును జెండాగా ఉపయోగించి రైలు డ్రైవర్‌ను హెచ్చరించాడు. తద్వారా పెద్ద రైలు ప్రమాదాన్ని నివారించాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలోని రైల్వే యార్డు సమీపంలో సెప్టెంబర్ 28న ఈ ఘటన జరిగింది.

ముర్సలీన్ షేక్ అనే బాలుడు యార్డ్‌లో పనిచేస్తున్న వలస కూలీ కొడుకు. ఘటన జరిగిన సమయంలో ముసలీన్‌ కొందరు కూలీలతో కలిసి యార్డులో ఉన్నాడు. అక్కడ యార్డుకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ కొంతభాగం దెబ్బతినడం, ఓ ప్యాసింజర్ రైలు వేగంగా రావడాన్ని ఆ బాలుడు గమనించాడు. వెంటనే ఆ కుర్రాడు తన ఎర్రటి టీ షర్టు తీసి ఎదురుగా వస్తున్న రైలు వైపు ఊపడం మొదలుపెట్టాడు. రైలు లోకోమోటివ్ పైలట్ సిగ్నల్‌ను గుర్తించి ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాదం తప్పింది.

"మాల్డాలోని 12 ఏళ్ల చిన్నారి తన ఎర్ర చొక్కాను ఊపి రైలు ఆగేలా చేశాడు. ఈ కారణంగా లోకో-పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసి ప్యాసింజర్ రైలును ఆపేశాడు. భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో చిన్నారి ఇలా చేశాడు" అని నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి సబ్యసాచి  తెలిపారు. "ట్రాక్‌ల క్రింద వర్షానికి దెబ్బతిన్న భాగాన్ని చూసి, బాలుడు సరైన సమయంలో తెలివిగా వ్యవహరించాడు, అప్రమత్తమయ్యాడు" అని అధికారి జోడించారు. అనంతరం ఇంత గొప్ప పని చేసిన ఆ బాలుడిని అధికారులు ప్రశంసించారు.

రైల్వే అధికారులు బాలుడికి ధైర్య ధృవీకరణ పత్రంతో సత్కరించారు. నగదు బహుమతిని కూడా అందించారు. స్థానిక పార్లమెంటు సభ్యుడు, డివిజనల్ రైలు మేనేజర్ బాలుడి ఇంటికి వెళ్లి మరీ అతన్ని అభినందించారు. ట్రాక్ దెబ్బతిన్న భాగాన్ని మరమ్మతులు చేసి, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.