
Bengaluru Airport Scam: దక్షిణాధి రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా తమ వ్యాపార అవసరాలు, ఉపాధి కోసం ఎక్కువగా ప్రయాణించేది బెంగళూరు నుంచే. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నుంచి అనేక డొమెస్టిక్, అంతర్జాతీయ ప్రయాణికులు రోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే కొందరు దీనిని ఆసరాగా చేసుకుని ఎయిర్ పోర్ట్ అడ్డాగా టాక్సీ స్కామ్స్ కి పాల్పడుతున్నట్లు వెల్లడైంది.
వివరాల్లోకి వెళితే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రయాణికులు పెరుగుతున్న టాక్సీ స్కామ్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బిల్లులు, అధిక ఛార్జీల వసూలు, ఒక్కోసారి ప్రయాణికులను బెదిరించటం వంటివి జరుగుతున్నట్లు చాలా మంది ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో మే 31న వివేక షన్నోయ్ అనే వ్యక్తి తన భార్యకు ఎదురైన పరిస్థితి గురించి ఎక్స్ లో చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
తన భార్య రాజశ్రీ జేపీ నగర్ ప్రాంతానికి విమానాశ్రయం నుంచి 41 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.2వేల 308 వసూలు చేసినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఛార్జీ ఇందులో సగం వరకు మాత్రమే ఉంటుందని ఆయన వెల్లడించారు. డ్రైవర్లు నికిలీ డిజిటల్ బిల్స్ చూపి ప్రజల నుంచి అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అయితే అక్కడ టాక్సీ రాకెట్ ప్రమేయం ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెబుతున్నారు.
అలాగే మరొ కేసులో ఉబెర్ డ్రైవర్ తన ప్రయాణ సమయంలో లేట్ నైట్ చార్జీలు అంటూ తప్పుడు బిల్ చూపి అదనంగా డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. మరొక కేసులో ఓలా క్యాబ్ డ్రైవర్ కల్యాణి నగర్ నుంచి విమానాశ్రయానికి యాప్ లో చూపించిన దాని కంటే రూ.200 అదనంగా ఇవ్వకపోతే మధ్యలోనే వదిలేస్తానని బెదిరించినట్లు సమంత అనే మహిళ వెల్లడించారు.
పరిస్థితులు దిగజారటంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అధికారిగా కమ్యూటింగ్ యాప్స్ మాత్రమే వాడాలని, టాక్సీ స్కామర్లకు చిక్కొద్దని అనౌన్స్మెంట్స్ చేయటం గమనార్హం. ఇలాంటి వాటిని అరికట్టడానికి తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.