రాష్ట్రానికి మూడో ‘వందే భారత్’..ట్రైన్ షెడ్యూల్ ఇదే..

 రాష్ట్రానికి మూడో ‘వందే భారత్’..ట్రైన్ షెడ్యూల్ ఇదే..
  • రేపు వర్చువల్​గా ప్రారంభించనున్న  ప్రధాని మోదీ
  •  కాచిగూడలో జెండా ఊపనున్న గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  •  కాచిగూడ నుంచి బెంగళూరు వరకు ట్రైన్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి మూడో వందే భారత్ ఎక్స్ ప్రెస్ సాంక్షన్ అయింది. కాచిగూడ (హైదరాబాద్)  నుంచి యశ్వంతపూర్ (బెంగళూరు) వరకు నడవనున్న ఈ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 24న (ఆదివారం) ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి కానుకగా రాష్ట్ర ప్రజలకు మోదీ ఈ ట్రైన్ ను ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మూడు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. సంక్రాంతి కానుకగా.. సికింద్రాబాద్ – విశాఖపట్నం రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్ – -తిరుపతి రైలును కేంద్రం ప్రారంభించగా.. ఇప్పుడు గణపతి నవరాత్రుల కానుకగా.. కాచిగూడ – -బెంగళూరు వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నదని వెల్లడించారు.  కాగా, కాచిగూడలో గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ట్రైన్ ను ప్రారంభించనున్నారు. ట్రైన్ ఓపెనింగ్ పోగ్రాంకు అటెండ్ కావాలని సీఎం కేసీఆర్ కు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇన్విటేషన్ పంపారు. 

ట్రైన్ షెడ్యూల్ ఇదే.. 

  •     బుధవారం మినహా ప్రతిరోజూ కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపురం (10.54) స్టేషన్లలో ఆగుతూ యశ్వంతపూర్ (మధ్యాహ్నం 2.15) చేరుకుంటుంది.
  •     మధ్యాహ్నం 3గంటలకు యశ్వంతపూర్‌‌నుంచి బయలుదేరి, అనంతపురం (5.40), కర్నూల్ సిటీ (7.50), మహబూబ్‌‌నగర్ (21.39) స్టేషన్లలో ఆగుతూ రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
  •     ఆదివారం మాత్రం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి.. ఫలక్‌‌నుమా, ఉందానగర్, షాద్‌‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌‌నగర్, దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపుం, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంతపూర్ చేరుకుంటుంది. 

మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు:

  •  ఇది 12 జిల్లాల గుండా వెళ్తుంది (తెలంగాణ - హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్; ఆంధ్రప్రదేశ్ - కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి; కర్ణాటక - చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్)
  •  సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లు
  • గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు.. వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు
  • ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ (హైదరాబాద్), కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్ (బెంగళూరు)
  •  ఈ మార్గంలో ఉన్నటువంటి  ప్రముఖ పర్యాటక కేంద్రాలు.. సమతామూర్తి (స్టాచూ ఆఫ్ ఈక్వాలిటీ), గోల్గొండ కోట, చార్మినార్, గద్వాల్ కోట, శ్రీశైలం (కర్నూలు సమీపంలో) సత్యసాయి ప్రశాంతి నిలయం (అనంతపూర్), బెంగళూరులోని పర్యాటక కేంద్రాలు
  •  దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానిని ఈ రైలు అనుసంధానం చేస్తుంది.