మా పెళ్లై రెండేళ్లయింది... కానీ ఫ్లై ఓవర్ మాత్రం పూర్తి కాలె

మా పెళ్లై రెండేళ్లయింది... కానీ ఫ్లై ఓవర్ మాత్రం పూర్తి కాలె

బెంగళూరులో ట్రాఫిక్ గురించి, దాని వల్ల ప్రయాణికులు ఎదుర్కొనే సమస్యల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐటీ హబ్ గా పేరు తెచ్చుకున్నా ట్రాఫిక్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండడం లేదు. దీని వల్ల చాలా మంది అసహనానికి లోనవుతుండడం కొత్తేం కాదు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఆ ట్రాఫిక్ వల్లే తనకు మంచి జరిగిందని చెప్తున్నాడు. ట్రాఫిక్ లో ఇరుక్కోవడం వల్లే తన లవ్ సక్సెస్ అయిందని చెప్పడం వింటుంటే నవ్వు తెప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వార్తను ఓ రెడిట్ యూజర్ షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరల్ గా మారింది. 

ఇంతకీ ఏం జరిగందంటే... 

ఓ రోజు తన గర్ల్‌ఫ్రెండ్‌ని వాళ్లింట్లో డ్రాప్ చేసేందుకు బైక్‌పై కూర్చోబెట్టుకుని వెళ్తుండగా అదే దారిలో ఎజిపుర ఫ్లై ఓవర్ వర్క్ జరుగుతోందని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ట్రాఫిక్‌లో అలా చాలా సేపు ఇరుక్కుపోయిన తనకు చాలా చిరాకేసిందని, ఆకలి కూడా వేసిందని తెలిపారు. అప్పుడు అక్కడ్నుంచి వేరే దారిలో వెళ్లి డిన్నర్ చేశామని, ఆ సమయం నుంచే తమ మధ్య చనువు పెరిగిందన్నాడు. అలా మొదలైన తమ కథ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ఇద్దరం డేటింగ్ చేశామని, రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నామని తెలిపారు. కానీ...ఎజిపుర ఫ్లై ఓవర్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదని ఆ యూజర్ చివర్లో ఓ ట్విస్ట్ ఇచ్చాడు. తన లవ్ స్టోరీని చెప్తూనే అక్కడి పనుల్లో ఎంత జాప్యం జరుగుతోందో చాలా తెలివిగా చెప్పకనే చెప్పాడన్నమాట. అయితే ఈ పోస్టును ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీన్ని వేలాది మంది లైక్ చేయగా... వందల కామెంట్స్ వచ్చి పడ్డాయి. ఈ లవ్‌స్టోరీని చదివి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న నెటిజన్లు...బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా అందరికీ రిలేట్ అయ్యే కథ. నేను బెంగళూరుకు వచ్చినప్పటి నుంచి ఆ పనులు నడుస్తూనే ఉన్నాయంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.