భారత్ బంద్ కదా.. స్కూల్స్, బ్యాంకులు ఉంటాయా.. మూసేస్తారా.?

భారత్ బంద్ కదా.. స్కూల్స్, బ్యాంకులు ఉంటాయా.. మూసేస్తారా.?

రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ  వైఖరిని ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఫిబ్రవరి 16న తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచేందుకు గ్రామీణ భారత్ బంద్ (దేశవ్యాప్త సమ్మె)కు చేపట్టనుంది. దేశ వ్యాప్తంగా ఈ బంద్ కు మద్దతు తెలపాలని రైతు సంఘాలను కోరింది. ఫిబ్రవరి 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామీణ భారత్ బంద్ పేరుతో దేశవ్యాప్త సమ్మె ప్రారంభం కానుంది. అదే రోజు పంజాబ్ లో రాష్ట్ర, జాతీయ రహదారులు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం నాలుగు వరకు మూసివేస్తున్నట్లు నిరసన కారులు స్పష్టం చేశారు.

ఏవి బంద్..ఏవి ఓపెన్.?

దేశవ్యాప్తంగా గ్రామాల్లోని  ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ,దుకాణాలు శుక్రవారం మూసివేయబడతాయి, వ్యవసాయ కార్యకలాపాలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) గ్రామీణ పనులు, గ్రామీణ పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు కూడా మూసివేయబడతాయి. అయితే అంబులెన్స్‌లు, పాఠశాలలు, విద్యాసంస్థలు, ఫార్మసీలు,  ఎమర్జెన్సీ సేవలు శుక్రవారం యథావిధిగా పనిచేస్తాయి. బ్యాంకులు  కూడా తెరిచి ఉంటాయి. 

ఢిల్లీ సరిహద్దులో భారీగా పోలీసు బలగాలు

మరో వైపు  పంజాబ్, రాజస్తాన్, హర్యానా, యూపీ రైతులు ఢిల్లీ ముట్టడికి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రైతులను ఎక్కడికక్కడ ఆపటానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలు రంగంలోకి దించింది మోదీ ప్రభుత్వం. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా ఢిల్లీ సరిహద్దులను మూసివేసింది. ఇదే సమయంలో భారీ ఎత్తున ఆయుధాలను రెడీ చేసుకుంది.

30 వేల టియర్ గ్యాస్ షెల్స్ 

రైతులు ఢిల్లీ వైపు వస్తే వాళ్లను చెల్లాచెదురు చేయటానికి ఏకంగా 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ సిద్ధం చేసుకున్నారు పోలీస్ బలగాలు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వీటిని తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర గ్వాలియర్ నుంచి ఇప్పటికే ఇవి ఢిల్లీ పోలీసుల చేతుల్లోకి చేరాయి. ఈ 30 వేల టియర్ గ్యాస్ షెల్స్ ను ఢిల్లీ చుట్టూ రక్షణగా ఉన్న పోలీస్ బలగాలకు చేరాయి. 

ALSO READ | Farmers Protest: రైళ్లు బంద్ చేస్తాం .. రైతుల అల్టిమేటం

టియర్ గ్యాస్ ప్రయోగించటం ద్వారా గుంపులను చెదరగొట్టటంతోపాటు కళ్ల మంట, చికాకు ద్వారా రైతులు ముందుకు రాకుండా అడ్డుకుంటుంది. టియర్ గ్యాస్ ప్రయోగం అనే వ్యూహంతో రైతులను అడ్డుకోవటానికి ముఖ్యమైన ఆయుధంగా భావిస్తున్నారు పోలీసులు. రబ్బర్ బుల్లెట్ల కంటే టియర్ గ్యాస్ ప్రయోగం ద్వారా.. రైతులు ఢిల్లీలో అడుగు పెట్టకుండా చూడాలనేది పోలీసుల యాక్షన్ ప్లాన్. మరి ఈ వ్యూహాన్ని రైతులు ఎలా చేధించుకుని వస్తారో చూడాలి...