టీమిండియాకు మరో దెబ్బ: గాయంతో సూర్యకుమార్ ఔట్

టీమిండియాకు మరో దెబ్బ: గాయంతో సూర్యకుమార్ ఔట్

లక్నో: శ్రీలంకతో టీ20 సిరీస్ కు ముందు భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లు వరుసగా దూరం అవుతున్నారు. మొన్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ దూరమవగా.. నిన్న దీపక్ చాహర్ కూడా తొడ కండరాల గాయంతో సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న సూర్యకుమార్ కూడా గాయంతో సిరీస్ కు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. మంగళవారం లక్నోలో ప్రాక్టీస్ సెషన్ కు హాజరైన సూర్యకుమార్ గాయం దెబ్బకు మైదానంలో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. చేతికి అయిన గాయాన్ని ఎక్స్ రే తీయగా ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. కనీసం 2 నుంచి 3 వారాల విశ్రాంతి తీసుకుంటే తప్ప గాయం మానే పరిస్థితి లేకపోవడంతో సూర్యకుమార్ కూడా లంకతో సిరీస్ కు దూరమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఆటగాళ్లు కానీ.. బీసీసీఐ అధికారులు కానీ స్పందించలేదు.