సివాన్: ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల కూటమిపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలకు దిగారు. బిహార్లో ఆటవిక రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలని ఆర్జేడీ భావిస్తోందని మండిపడ్డారు. ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే బిహార్లో మళ్లీ ఆటవిక రాజ్యాన్ని ప్రవేశపెడతాయని యోగి చెప్పారు. ‘15 ఏళ్ల కింద కొందరు వ్యక్తులు బిహార్ గుర్తింపునకు ముప్పు తెచ్చారు. ఇక్కడ జంగిల్ రాజ్ పవర్లో ఉన్నప్పుడు అవినీతి ఏ స్థాయిలో ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలి. ఆరేళ్ల కిందట ప్రధాని మోడీని ఎన్నుకున్నాక దేశ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. ఇప్పుడు ఏ పేదోడికీ కులం, మతం అనే తేడాలు లేవు. అందరినీ అభివృద్ధికి చేరువ చేస్తున్నాం’ అని బిహార్లోని సివాన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో యోగి పేర్కొన్నారు.

