శేరిలింగంపల్లి, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్రప్రసాద్ (50) ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం మియాపూర్లోని తన ఇంట్లో ఉరి వేసుకున్నారు. 30 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న జ్ఞానేంద్ర ప్రసాద్ మృతితో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు దిగ్ర్భాంతికి గురయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకానికి చెందిన జ్ఞానేంద్ర ప్రసాద్.. 30 ఏండ్ల కింద హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డారు. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేసిన జ్ఞానేంద్రప్రసాద్ హైదరాబాద్కు వచ్చాక బీజేపీలో క్రియాశీలకంగా మారారు. కార్యవర్గ సభ్యుడు స్థాయికి ఎదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ ఆశించినా దక్కలేదు. అలాగే, చిట్టీలు, ఫైనాన్స్ బిజినెస్తో పాటు రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేస్తుండేవారు.
ఇటీవల బిజినెస్లో నష్టం రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 2 నెలల క్రితం కారులో సంగారెడ్డి నుంచి తిరిగి వస్తుండగా, రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. అప్పటి నుంచి ఇంట్లోనే రెస్టు తీసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం కొద్దిసేపు పడుకుంటానని పీఏకు చెప్పి తన రూమ్కి వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత టిఫిన్ఇవ్వడానికి ఆయన రూమ్కి వెళ్లిన పీఏ.. తలుపు కొట్టినా తీయలేదు. దీంతో కిటికీలోంచి చూడగా, జ్ఞానేంద్ర ఫ్యాన్కి ఉరి వేసుకుని కనిపించాడు. కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.