మోడీ పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు చెప్పాలి

మోడీ పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు చెప్పాలి

జయశంకర్ భూపాలపల్లి: కష్టజీవి అయిన ప్రధాని మోడీ చరిత్ర ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రధాన మంత్రి హోదాకు చేరుకున్నారంటే అది ఆయన కృషి మరియు పట్టుదల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు. భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోడీ విజయాలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘దేశానికి మంచి చేయాలని ఆర్ఎస్ఎస్ లో పనిచేసి.. రెండుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రజలకు మోడీ చేసిన పథకాలను ఒక పాఠంలాగా ప్రజలకు తెలియచేయాలి. ఒక ఛాయ్ వాలా నుంచి ప్రధాన మంత్రి హోదాకు ఎదిగి.. ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో మోడీ ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 11 సంవత్సరాలు పనిచేసి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. ప్రధానిగా ప్రజలకు ఉపయోగపడేలా ప్రాజెక్టులు నిర్మించారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. 
భారతదేశాన్ని అన్ని విధాలుగా ముందు వరుసలో ఉంచారు. 70 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇప్పించారు. వ్యాక్సినేషన్ ప్లెక్సీల్లో మోడీ ఫొటో పెట్టి అవగాహన కల్పించాలి. 80 కోట్ల మందికి 10 కిలోల బియ్యం, పప్పు, నూనె సామాగ్రిలను అందించారు’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు.