- దేశ రాజకీయాలను మలుపుతిప్పుతానంటూ కేసీఆర్ ప్రగల్బాలు
- బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
ఆదిలాబాద్ : సొంత రాష్ట్రంలోనే సీఎంను నమ్మలేని పరిస్థితి ఉన్నా.. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతానంటూ కేసీఆర్ బయల్దేరారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. అవినీతిలో రాష్ట్రం నంబర్ వన్గా ఉందని, అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు వచ్చే ప్రమాదముందన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఎంపీ సోయం బాపురావు ఇంట్లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ జిల్లా ఆఫీసులో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొని మాట్లాడారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత బీజేపీ ఓ శక్తిగా ఎదిగిందన్నారు. సీఎంను గద్దె దించాలని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పటికే కేసీఆర్ గ్రాఫ్ పడిపోతుండటంతో టీఆర్ఎస్లో భయం మొదలైందని చెప్పారు. గతంలో పీకే అవసరం లేదన్న కేసీఆర్.. ఇప్పుడు ఆయన సాయం తీసుకోవడమే నిదర్శనమన్నారు. ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణాలో పీకే స్కీములేవీ పనిచేయవని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు డబ్బు, మద్యం, బిర్యానీ, కుల సంఘాలకు భవనాలు వంటి వాటిని ఎరవేసి కేసీఆర్ ఓట్లు అడుగుతారని, పీకే నిర్ణయాలు కూడా ఇలాగే ఉంటాయని ఆయన విమర్శించారు.
పదాధికారులదే బాధ్యత: బాపురావు
పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత పదాధికారులదేనని ఎంపీ సోయం బాపురావు అన్నారు. క్రమశిక్షణలేని నాయకులను సస్పెండ్ చేయడానికి అధిష్ఠానం ఎప్పుడూ వెనకాడదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కార్యకర్తలు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించాలన్నారు. టీఆర్ఎస్ కన్నా బీజేపీ కార్యకర్తల బలం ఎక్కువని, విజయం కోసం చివరిదాకా పోరాడే సత్తా ఉందన్నారు.
సీఎం తప్పుడు నిర్ణయాలతో రైతులకు నష్టం
వరి వేయొద్దని, వేసినా కొనబోమన్న సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయాలతో రైతులు నష్టపోయారని వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో అమలు చేసే ప్రతి పథకంలోనూ కేంద్రం వాటా ఉందని, ఆ విషయం ప్రజలకు తెలియకుండా ఆ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫసల్బీమా, ఆయుష్మాన్ భారత్ వంటి అద్భుతమైన పథకాలను అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర పథకాలు, రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులున్న దుబ్బాకలో గెలిచామని, జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి సొమ్ము రూ.100 కోట్లను కుమ్మరించినా గెలువలేకపోయారని వివేక్ గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. సమావేశం తర్వాత బీజేపీ ప్రచార రథాన్ని వివేక్ ప్రారంభించారు. అంతకుముందు వివేక్ వెంకటస్వామిని పార్టీ నాయకులు, దళిత మోర్చా నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సమావేశాల్లో పార్టీ జిల్లా ఇన్చార్జి ఆల్చాపూర్ శ్రీనివాస్, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పాయల్ శంకర్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, నాయకులు సుహాసిని రెడ్డి, మల్లికార్జున్, వేణు గోపాల్, ఆధీనాథ్, జీవీ రమణ, లాలా మున్న, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.