ఏపీ కొత్త డీజీపీగా హరీష్​ కుమార్​ గుప్తా నియామకం

ఏపీ కొత్త డీజీపీగా  హరీష్​ కుమార్​ గుప్తా నియామకం

ఏపీ ఇంఛార్జీ డీజీపీగా హరీష్​ కుమార్​ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ వేటు వేసిన నేపథ్యంలో కొత్త డీజీని నియమించే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 

ఏపీ ఇంఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి  హరీష్​ కుమార్​ గుప్తా ( IPS Harees Kumar Gupts) నియమితులయ్యారు.  తక్షణమే ఆయనను బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది.  డీజీపీ  నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం ( మే 5)  వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ ల వివరాలను ప్యానెల్ తో పాటు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి నిర్దేశించింది. సీఎస్ పంపిన జాబితాలో ఒకరిని హరీష్​ కుమార్​ గుప్తా డీజీపీగా ఎంపిక చేసింది. 

హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తాజా నియామకం నేపథ్యంలో, తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీశ్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది.

ప్రతిపక్షాల ఆరోపణలతో..

ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆయా పార్టీల నేతల ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఆయన అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అణగదొక్కడంపై విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఆయన ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే ప్రచారం సాగింది. ఆయన డీజీపీగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫిర్యాదులతో విచారణ చేసిన ఈసీ.. డీజీపీపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఆదేశించింది.