హైదరాబాద్ లోని ఉప్పల్ లో దారుణం జరిగింది.భార్యపై అనుమానంతో దారుణంగా హత్య చేశాడు భర్త. శనివారం ( జులై 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకనగర్ లో నివాసం ఉంటున్నారు జెస్సికా, సురేష్ దంపతులు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు భార్యాభర్తలు గత నాలుగేళ్లుగా చిలుకనగర్ లో ఉంటున్నారు. 2015లో వివాహం అయిన వీరికి పదేళ్ల కూతురు కూడా ఉంది.
జెస్సికాపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు సురేష్. ఇవాళ కూడా భార్యాభర్తలిద్దరు గొడవపడ్డారు. గొడవ శృతి మించడంతో జెస్సికాను దారుణంగా హత్య చేశాడు సురేష్. ఆ తర్వాత జెస్సికా అక్కకు ఫోన్ చేసి విషయం చెప్పాడు సురేష్.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
