పోలీసుల నిర్బంధాలు, అరెస్ట్ ల మధ్య కలెక్టరేట్ల ముట్టడి

పోలీసుల నిర్బంధాలు, అరెస్ట్ ల మధ్య కలెక్టరేట్ల ముట్టడి
  • చాలాచోట్ల తోపులాటలు, రోడ్డుపై ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • పలువురు కార్యకర్తలకు గాయాలు.. నల్గొండలో స్వల్ప లాఠీచార్జీ
  • గడీల ఉన్న కేసీఆర్​కు.. జనం గోడు కనిపిస్తలేదు: సంజయ్
  • తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టేందుకే ఎల్​ఆర్ఎస్​ బాదుడు: వివేక్​

హైదరాబాద్, వెలుగుపేదలను దోచుకునే ఎల్ఆర్ఎస్ జీవోను వెంటనే రద్దు చేయాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలు, పోలీసు నిర్బంధాలు, అరెస్టుల మధ్య కొనసాగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్లలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చాలా జిల్లాల్లో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.కొన్ని చోట్ల కార్యకర్తలను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో పలువురు గాయపడ్డారు. అంతటా లీడర్ల అరెస్టులు కొనసాగాయి.అన్ని జిల్లాల్లో కదం తొక్కిన కార్యకర్తలు

హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బీజేపీ కార్యకర్తలు, నాయకులు ధర్నాలు, బైఠాయింపులు, నిరసనలు చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నేతలు బంగారు శ్రుతి, శ్రీధర్ రెడ్డి, గౌతంరావు, శ్యాంసుందర్ గౌడ్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కు చెందిన దుర్గా అనే కార్యకర్త కలెక్టరేట్ వద్ద చింత చెట్టు ఎక్కి కొద్ది సేపు హల్ చల్ చేశాడు. తర్వాత రాంచందర్ రావు, చింతల రామచంద్రారెడ్డితోపాటు ఇతర నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్ ముందు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, గద్వాలలో డీకే అరుణ వంటి సీనియర్ నేతలు ధర్నా చేశారు. పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు. కరీంనగర్ లో కార్యకర్తలను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఓ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ను ఏసీపీ అశోక్‌‌‌‌ అడ్డుకుని తిట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్గొండలో కలెక్టర్ చాంబర్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ సందర్భంగా స్వల్ప లాఠీచార్జ్ చేశారు. జనగామలో ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ లోకి చొచ్చుకొచ్చి భవన అద్దాలను ధ్వంసం చేశారు. మహబూబ్ నగర్ లో  పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బీజేపీ క్యాడర్ ధర్నాలు చేసింది.

హక్కుల కోసం గొంతెత్తడం నేరమా?

గడీకి పరిమితమైన సీఎం కేసీఆర్ కు ప్రజల గోడు పట్టడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో పౌరులు తమ హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్​దని విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం అమానవీయమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. డబుల్​బెడ్రూం ఇండ్లు ఇస్తామని ఆశచూపి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆ పార్టీకి గట్టి సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

40 వేల ఇండ్లు కూడా కట్టలే: లక్ష్మణ్

రాష్ట్రంలో 2 లక్షల 63 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కడతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఈ ఆరేండ్లలో 40 వేలు కూడా కట్టలేదని బీజేపీ సీనియర్ నేత కె. లక్ష్మణ్ విమర్శించారు. పేదలను మభ్యపెట్టి గ్రేటర్ హైదరాబాద్, అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు దండుకుందన్నారు. గ్రేటర్​లో లక్ష ఇండ్లు కట్టామని మంత్రి తలసాని చెప్తుంటే నవ్వొస్తోందన్నారు. నియోజకవర్గానికి 4 వేలు ఇండ్లు కడతామంటూ సర్కార్ చెప్పిందని, కానీ మంత్రి తలసాని మాత్రం ముషీరాబాద్​లో 631 ఇండ్లు కట్టించి 430 మందికి ఇచ్చామని చెప్పారని ఎగతాళి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను ప్రవేశపెట్టినా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్​లో లక్ష మంది దరఖాస్తు చేసుకున్నా ఒక్క అప్లికేషన్​నూ రాష్ట్ర సర్కార్​ లెక్కలోకి తీసుకోలేదన్నారు.

ఉద్యమ స్ఫూర్తి చాటారు

పోలీసుల నిర్బంధాలు, ముందస్తు అరెస్టులను చేధించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట కార్యకర్తలు, నాయకులు ధర్నాలు చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనను వ్యక్తం చేసిన పార్టీ క్యాడర్ కు హ్యాట్సాఫ్‌ చెప్పారు. బీజేపీ ఇచ్చిన పిలుపును ఫెయిల్ చేసేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి నుంచే అరెస్టులు చేశారని, ఆందోళనలో పాల్గొన్న కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేశారని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. పోలీసుల సాయంతో ప్రజాస్వామిక విలువలు, హక్కులను టీఆర్ఎస్​ సర్కార్​ కాలరాస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన సాగుతోందా, లేక పోలీసు రాజ్యం నడుస్తోందా అనే అనుమానం కలుగుతోందని ధ్వజమెత్తారు.