నన్ను అసెంబ్లీలో చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన

నన్ను అసెంబ్లీలో చూడొద్దన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన

సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిరసనగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కేసీఆర్ చేసిన మూర్ఖపు మాటలకు వ్యతిరేకంగానూ ఈ నిరసన చేపట్టామన్నారు.  ఈ దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్షగా భావించిన రాజ్యాంగాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని అన్నారు. ఇందిరా పార్క్‌ వద్ద ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్‌లో తన లాంటి ఉద్యమకారుడిని, 20 ఏండ్ల పాటు తనతో పాటు నడిచిన వ్యక్తిని కుట్రపూరితంగా వెళ్లగొట్టి.. తన గొంతును పూర్తిగా నొక్కేయాలని సీఎం కేసీఆర్ యత్నించారని అన్నారు. అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సొమ్మును ఆరు నెలల పాటు హుజురాబాద్‌లో కుమ్మరించారని, పదుల సంఖ్యలో మంత్రులను అక్కడి దించి, మళ్లీ తన ముఖం అసెంబ్లీలో కనిపించకుండా చేయాలని కుట్రలు పన్నినా సరే ప్రజలు బీజేపీకే ఓటు వేసి తనను గెలిపించారని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలు.. కేసీఆర్ అహంకారాన్ని ఓడించిన సమయంలో ఆయన నైతిక బాధ్యత తీసుకుని సీఎం పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తారని భావించానని అన్నారు. కానీ కేసీఆర్ తన నియంతృత్వ ధోరణిని బయటపెట్టుకుంటూ రాజ్యాంగాన్నే రద్దు చేస్తానంటూ మాట్లాడారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం రద్దు చేసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌‌కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది

అసెంబ్లీలో తనను చూడకూడదన్నదే కేసీఆర్ దుర్మార్గపు ఆలోచన అని, అందుకే సభ మొదలైన కొద్ది నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గురిని సెషన్ మొత్తం సెస్పెండ్ చేశారని ఈటల అన్నారు. రాష్ట్రంలో అనధికారికంగా కేసీఆర్ తన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. తమ సస్పెన్షన్‌పై హైకోర్టుకు వెళ్తే.. న్యాయస్థానం సున్నితంగా స్పీకర్‌‌కు సూచన చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేలా నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చినా పట్టించుకోలేదని అన్నారు. సభా సాంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కి.. బీజేపీ ఎమ్మెల్యేల హక్కులను అణచివేశారని ఈటల అన్నారు. ఈ సమయంలో తమకు మిగిలింది ప్రజా క్షేత్రమేనని, ప్రజల తరఫున కొట్లాడుతామంటే కనీసం దీక్షలు, ధర్నాలకు కూడా ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం లేదని అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన సంఘాలను కేసీఆర్ లేకుండా చేస్తున్నారని, సంఘాల ఉండొద్దంటే ఈ రోజు కేసీఆర్‌‌కు ఆ పదవి ఎక్కడిదని అన్నారు. కేసీఆర్‌‌కు ప్రజలు త్వరలోనే బుద్ది చెప్పే రోజు వస్తుందని అన్నారు.

అనుమతి నిరాకరణ.. తర్వాత ఓకే

ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో బీజేపీ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టింది. బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ఆధ్వర్యంలో ఉదయం పది నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ముందుగా దీక్షకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లటంతో... చివరికి అనుమతి ఇచ్చారు. దీంతో దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్ సహా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఇతర సీనియర్ నేతలు, ఎంపీలు, కార్పొరేటర్లతో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి  బీజేపీ ఎమ్మెల్యేలను సెస్పెండ్ చేయడం, వారిని సభకు అనుమతించే విషయాన్ని పరిశీలించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్పీకర్ సీరియస్‌గా తీసుకోకుండా తిరస్కరించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ దీక్ష చేపడుతోంది.