మెదక్ జిల్లా: “కేసీఆర్ నువ్వు హిందువే అయితే గోరక్షణ చేద్దాం రా, జిహాది లను కంట్రోల్ చేద్దాం రా..” అంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేయనున్న క్రమంలో శనివారం నియోజకవర్గంలోని చేగుంట మండలంలో బీజేపీ రాష్ట్ర నేతలు రఘునందన్ రావు, మాజి ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటించారు. ఈ సందర్భంగా గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. అధికార పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని, ఓటు మాత్రం బీజేపీ కే వేయాలని సూచించారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో అదే జరిగిందని అన్నారు.
తాను ఎక్కడికి వెళ్తే అక్కడ గెలిచామని..దుబ్బాకలో కూడ గెలుద్దామని పిలుపు నిచ్చారు రాజాసింగ్. నిజామాబాద్ ,కరీంనగర్ గెలిచినట్టు దుబ్బాక ను కూడా గెలుద్దామని అన్నారు. అసెంబ్లీ లో బీజేపీ ఎమ్మెల్యేగా తాను ఒక్కడినే ఉన్నానని ..భాష సమస్య ఉన్నా.. కష్టపడి మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. తనతో రఘునందన్ రావు కూడా ఉంటే ఎలా ఉంటుందో చూడండంటూ నియోజకవర్గ ప్రజలను ఉత్తేజ పరిచారు.
దేశంలో బిజేపి పాలన చూస్తున్నామని, ప్రధాని మోడీ పాలన లో దేశం ముందుకు వెళుతుందన్నారు. కేంద్రం నుండి తెలంగాణ అబివృద్దికై కోట్ల రూపాయలు వస్తున్నా..సీఎం కేసీఆర్ మాత్రం ఏమీ రావడం లేదంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. రాష్ట్రాన్ని మత్తు తెలంగాణగా చేసి, తెలంగాణ యువతను తాగుబోతులుగా మార్చాడన్నారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ తో మన రక్తం తాగుతున్నాడని.. పన్నుల రూపంలో నిజాం పైసలు గుంజినట్టు కేసీఆర్ గుంజుతున్నాడని అన్నారు. దళితులకు ఇచ్చిన హామిలను నేరవెర్చని మోసగాడు కేసీఆర్ అని అన్నారు.