ఫోన్ ట్యాపింగ్ కేసు .. సీబీఐకి అప్పగించాలి : లక్ష్మణ్ 

ఫోన్ ట్యాపింగ్ కేసు .. సీబీఐకి అప్పగించాలి : లక్ష్మణ్ 
  • లేదంటే గవర్నర్​కుఫిర్యాదు చేస్తం
  • ఈ వ్యవహారంలో టామ్ అండ్ జెర్రీలా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫైట్
  • సూత్రధారులను కాపాడేందుకురాష్ట్ర సర్కార్ ప్రయత్నం
  • కాళేశ్వరం, ధరణి అక్రమాలపై విచారణేది? అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టామ్‌‌ అండ్‌‌ జెర్రీ మాదిరి కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌ కొట్టుకుంటున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. సీఎం రేవంత్‌‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదంటే గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దేశ భద్రతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాగిందని, ఇందులో అసలు సూత్రధారులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ పదేండ్ల పాలన, అభివృద్ధిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం, ధరణి, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలతో ప్రతిరోజు పతాక శీర్షికల్లో వార్తలు వచ్చేలా రేవంత్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ‘‘ఎవరి నమ్మకం వారిది. జై శ్రీరామ్ అంటే కేటీఆర్ కు కడుపుమంట ఎందుకు?” అని ప్రశ్నించారు. 

బీఆర్ఎస్ అవినీతిపై విచారణేది?  

బీఆర్‌‌ఎస్‌‌ అవినీతిపై కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసిందని, కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దానిపై ఇప్పటి వరకు విచారణ జరిపించలేదు. ధరణి పోర్టల్ పై కమిటీ వేసి మసిపూసి మారేడుకాయ చేశారు. మద్యం విక్రయాలు, విద్యుత్ కొనుగోళ్లలోనూ అవినీతి జరిగింది.

వాటిపైనా విచారణ జరిపించడం లేదు” అని ఫైర్ అయ్యారు.  ‘‘2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలు, దుబ్బాక, మునుగోడు బై ఎలక్షన్లలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిందే ఫోన్ ట్యాపింగ్ వల్ల. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.