సొంత ఇలాకాలోనే కేటీఆర్ నైతికంగా ఓడిపోయిండు

సొంత ఇలాకాలోనే కేటీఆర్ నైతికంగా ఓడిపోయిండు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీజేపీ భవిష్యత్‌కు నాంది అని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్. ఈ ఫలితాలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు చెంపపెట్టు అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ కి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా…ఏ పార్టీ తో పొత్తు లేకుండా పోటీ చేసింది బీజేపీ మాత్రమేనని అన్నారు.

కేటీఆర్ సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల లో టీఆర్ఎస్ రెబల్స్ గెలవటం సిగ్గుచేటు అని అన్నారు లక్ష్మణ్. ఏకపక్షంగా మున్సిపాలిటీలను గెలుస్తామన్న కేటీఆర్ ఇప్పుడే సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సొంత ఇలాకాలోనే ఆయన నైతికంగా ఓడి పోయారన్నారు లక్ష్మణ్. ఈ ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్ కి  ఓ హెచ్చరిక అని చెప్పారు.రాష్ట్రంలో బీజేపీ లేనేలేదన్న కేటీఆర్.. గద్వాల, నిజామాబాద్, అమన్ గల్ వెళ్లి చూస్తే బీజేపీ ఎక్కడుందో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు.

సంక్షేమ పథకాలకు పట్టం కడతారని అన్న టీఆర్ఎస్ నేతలు ఈ ఎన్నికల్లో డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు లక్ష్మణ్.  ఓటు వేయకుంటే మీ సంగతి చూస్తామని అధికార పార్టీ నేతలు ఓటర్ల ను హెచ్చరించారన్నారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఆ పార్టీపై తిరుగుబాటు చేస్తే..  వారి పై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. క్యాంప్ రాజకీయాలు దేనికని అడిగారు. ఒక్క మునిసిపాలిటీ చైర్మన్ ని కూడా ప్రకటించే ధైర్యం లేదన్నారు. క్రమ శిక్షణ రహితంగా నడిచే పార్టీ  టీఆర్ఎస్ అని, ఆ పార్టీకి  ప్రత్యమ్నాయం బీజేపీ నేనని ఆయన అన్నారు.

బీజేపీ ఒంటరిగా 85 శాతం స్థానాల్లో పోటీ చేయటమే తమ మొదటి విజయం అని పేర్కొన్నారు. బీజేపీ కి ఇది చిన్న విజయం ఏమి కాదని , మొత్తం 60 డివిజన్ లలో గెలిచామని లక్ష్మణ్ అన్నారు. మూడు మునిసిపాలిటీ లలో ఒంటరిగా గెలిచామని, కొన్ని మునిసిపాలిటీ లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా మారామని అన్నారు. తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నామని అన్నారు. Trs గ్రాఫ్ తగ్గుతుందని, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, గ్రేటర్ హైదరాబాద్ లో తమ సత్తా చూపెడుతామని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాల సమీక్షించుకుంటామని అన్నారు లక్ష్మణ్.

BJP president Laxman press meet at party office on Municipal elections