పేదలకు ఇంగ్లీష్ దూరం చేసే కుట్ర: అమిత్ షాకు రాహుల్ కౌంటర్

పేదలకు ఇంగ్లీష్ దూరం చేసే కుట్ర: అమిత్ షాకు రాహుల్ కౌంటర్

న్యూఢిల్లీ: ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గు పడే రోజు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా వ్యాఖ్యలపై శుక్రవారం (జూన్ 20) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అవుతూ బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‎పై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ పేద పిల్లలకు ఆంగ్లాన్ని దూరం చేసే కుట్ర చేస్తున్నాయన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్‎ నేర్చుకోవడం.. ప్రశ్నలు అడగడం, ఉన్నత వర్గాలకు సమానంగా వాళ్లు మారడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఇష్టం లేదన్నారు.

అందుకే పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకోవడం లేదని ఆరోపించారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం సిగ్గు చేటు కాదని.. అది మరింత శక్తి, ప్రోత్సహాన్ని ఇస్తోందన్నారు. ప్రస్తుత ప్రపంచంలో మాతృభాష లాగే ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం.. ఎందుకంటే అది ఉపాధిని కల్పిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతదేశంలోని ప్రతి భాషకు ఆత్మ, సంస్కృతి, జ్ఞానం ఉన్నాయి.. మనం వాటిని గౌరవించాలి. కానీ-- అదే సమయంలో ప్రతి బిడ్డకు ఇంగ్లీష్ నేర్పించాలన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరమని నొక్కి చెప్పారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతిరోజూ ఇంగ్లీషులో మాట్లాడకండి హిందీలో మాట్లాడండని చెబుతారు. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుల కోసం విదేశాలకు వెళ్తారు. మరీ ఇదేంటని రాహుల్ ప్రశ్నించారు. పేద పిల్లలు ఎదగకుండా చేయడం కోసమే ఇంగ్లీష్ నేర్చుకోవద్దని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇంగ్లీష్‎తోనే అభివృద్ధి సాధ్యమని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. 

గురువారం (జూన్ 19) మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన 'మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. మన భాషలను గౌరవించుకోవాలి. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలో సిగ్గుపడతారు.-- అలాంటి సమాజం ఏర్పడే రోజు దగ్గర్లోనే ఉంది. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే సమాజంలో మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను. మన భాషలు లేకుండా మనం నిజమైన భారతీయులుగా ఉండలేమని అన్నారు.