ఓయూ, వెలుగు:
బీజేపీ దేశం మొత్తాన్ని హిందుత్వ రాష్ట్రాలుగా మార్చాలని చూస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అందుకే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్తీసుకొస్తోందని విమర్శించారు. ఓయూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ‘‘సేవ్ ఇండియా –- సేవ్ కానిస్టిట్యూషన్” నినాదంతో ‘‘టాక్ విత్ సీతారాం ఏచూరి’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ… దేశాన్ని ఎన్నో సమస్యలు వెంటాడుతుంటే బీజేపీ అవన్నీ వదిలేసి ఎన్ఆర్సీ, సీఏఏలను ముందుకు తేవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సీఏఏతో దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి పైగా పౌరసత్వం కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. ఈ చట్టం అమలు చేస్తే ముస్లిం మైనారిటీల పౌరసత్వాలే ఎక్కువగా రద్దవుతాయని పేర్కొన్నారు. దేశాన్ని మతప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని, ఆర్ఎస్ఎస్ఎజెండాను అమలు చేస్తోందని ఆరోపించారు. ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం ఎన్పీఆర్ను ముందుకు తెచ్చిందన్నారు. ఎన్ఆర్సీ అమలు చేస్తే ప్రజలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుందని, దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్న వారు ఈ దేశ పౌరులుగా నిరూపించుకోవాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. సీఏఏ కేవలం ముస్లింలకే కాదు పేద ప్రజలందరికీ వ్యతరేకమని, అందుకే ఇది ప్రజా ఉద్యమంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎన్పీఆర్ను అమలు చేయబోమని సీఎం కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో 69 పిటిషన్లు ఫైల్అయ్యాయని, కానీ జనవరి 22 వరకు వాటిపై స్పందిచమని న్యాయస్థానం చెప్పడం బాధాకరమన్నారు. డాక్టర్నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఓయూ విభాగ అధ్యక్ష,కార్యదర్శులు గణేష్, రవి నాయక్, నిరుద్యోగ విద్యార్థి ఫ్రంట్ చైర్మన్ దయాకర్, ఏఐఎస్ఎఫ్ స్టాలిన్, పీడీఎస్యూ రంజిత్, శ్యామ్, శేఖర్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టికల్ 370 రద్దు అక్రమం
ఆర్టికల్370 రద్దు అక్రమమని సీతారాం ఏచూరి అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న బుక్ఫెయిర్ను ఆయన శుక్రవారం సందర్శించారు. నెల్లూరు నరసింహారావు సంపాదకత్వంలో తీసుకొచ్చిన ‘డిస్కెల్టింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీనియర్ జర్నలిస్టు వినయ్కుమార్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ పాల్గొన్నారు.


