హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ ను తిరిగి తెరుస్తామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే తననిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ జలసంధిపై తిరిగి ఆంక్షలు విధించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.
చమురు రవాణాలో కీలకమైన సముద్ర మార్గాన్ని తిరిగి తెరవాలన్న తన మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఇరాన్ హోర్ముజ్ జలసంధిపై తిరిగి ఆంక్షలను విధించింది. జలసంధి తిరిగి తెరిచినా తమ ఓడరేవుల దిగ్భంధనాన్ని ఎత్తివేయబోమని అమెరికా ప్రకటించిన వెంటనే శనివారం ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి తమ సాయుధ దళా నియంత్రణలోకి వచ్చిందని ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగినంత కాలం జలమార్గం ద్వారా నౌకల రవాణా జరగదని కమాండ్ హెచ్చరించింది.
పశ్చిమాసియాలో పరిస్థితి చక్కబడుతోంది.. ఇరాన్ ,అమెరికా మధ్య ఒప్పందాలు కుదిరాయి.. ఇక చమురు రవాణాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ప్రపంచ దేశాలు భావిస్తున్న సమయంలో అమెరికా, ఇరాన్ నిర్ణయం మరోసారి ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపాటుకు గురి చేసింది. యుద్దం ముగింపు దిశగా సోమవారం ఇస్లామాబాద్ లో ఇరాన్, అమెరికా చర్చలు జరపనున్నారు.
శుక్రవారం హార్ముజ్ జలసంది తెరుస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఓడరేవుల దిగ్భంధనం కొనసాగుతుందని ప్రకటించడం తాజా పరిస్థితులకు దారి తీసింది. ఇరాన్ తాజా చర్యతో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచుతోంది.
అంతకుముందు ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పశ్చిమ ఆసియాలో 40 రోజులకు పైగా కొనసాగిన అంతరాయానికి ముగింపు పలుకుతూ ఇరాన్ వాణిజ్య నౌకాయానం కోసం జలసంధిని తిరిగి తెరిచింది. సమన్వయ సముద్ర మార్గాల కింద కాల్పుల విరమణ కొనసాగేంత వరకు ఈ మార్గం తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చెప్పారు.
ఇదిలా ఉంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ,అమెరికా ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు సిద్దమవుతున్నాయి. సోమవారం ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ సారి రెండు దేశాల ప్రతినిధి బృందాలు ఒక రోజు ముందుగానే ఇస్లామాబాద్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

