మేఘాలయ హనీమూన్ ఘటన: సోనమ్కు రెండు ఆప్షన్లు ఇచ్చిన సుప్రీం కోర్టు

మేఘాలయ హనీమూన్ ఘటన: సోనమ్కు రెండు ఆప్షన్లు ఇచ్చిన సుప్రీం కోర్టు

ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ బెయిల్పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజా రఘువంశీ హత్య కేసులో బెయిల్ విషయంలో సోనమ్కు సుప్రీం కోర్టు రెండు ఆప్షన్లు ఇచ్చింది.

సుప్రీం జస్టిస్‌లు ఎంఎం సుందరేష్, పీబీ వరాలేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం, సోనమ్ తరఫు న్యాయవాదికి ఒక విషయం స్పష్టం చేశారు. సోనమ్ వాదనలు విన్న తర్వాత (ఆమె బెయిల్‌కు వ్యతిరేకంగా) మేఘాలయ ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై మెరిట్స్ ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోవచ్చని లేదా బెయిల్ అంశాన్ని కోర్టు పరిశీలించే వరకు (సాక్షుల విచారణ కోసం) ప్రస్తుతానికి లొంగిపోవాలని ఆమెను ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. 

సోనమ్కు, మేఘాలయ ట్రయల్ కోర్టు మంజూరు చేసి, మేఘాలయ హైకోర్టు సమర్థించిన బెయిల్‌ను మేఘాలయ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంలో మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

సోనమ్ తరఫు న్యాయవాది ఈ విషయంలో తమ స్పందనకు సమయం కోరారు. గురువారం లోగా కోర్టుకు తెలియజేస్తామని తెలిపారు. అయితే.. విచారణ సందర్భంగా, ఈ ఘటన తర్వాత సోనమ్ ప్రవర్తనను కూడా కోర్టు ప్రశ్నించింది. అలాగే, తన 'అరెస్టుకు కారణాలు' ముందుగా తెలియజేయలేదనే వాదనను సోనమ్ లేవనెత్తలేదన్న ఆరోపణపై వివరణ కోరింది.