న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వదంతులను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఖండించారు. మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నారని.. ఆయన తన పని తాను చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు. అమెరికాకు మొజ్తాబా ఆచూకీ దొరకడం లేదని.. అందుకే వారు ఆయన చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అమెరికా ఇరాన్ అగ్ర నాయకుల్లో చాలా మందిని లక్ష్యంగా చేసుకుందన్నారు. భారత రాజధాని ఢిల్లీ వేదికగా బ్రిక్స్ కూటమి సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఈ సదస్సుకు హాజరయ్యేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియా ఛానల్ ఇండియా టుడేకు పెజిష్కియాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మరణ వార్తలను ఆయన ఖండించారు. మోజ్తాబా ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పాడు.
2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా.. ఆయన కుటుంబ సభ్యులు పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయతొల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీ కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దాడుల తర్వాత ఖమేనీ బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. చివరకు ఆయన తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. దీంతో మోజ్తాబా ఖమేనీ కూడా చనిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోజ్తాబా ఖమేనీ ప్రాణాలతో ఉన్నాడని ఇరాన్ అధ్యక్షుడు పేర్కొనడంతో అతడి మరణ వార్తల పుకార్లకు తెరపడింది.
