2027 వన్డే ప్రపంచకప్కు సమయం ఉన్నప్పటికీ, మైదానంలో టీమిండియాను దెబ్బకొట్టేందుకు సౌతాఫ్రికా ఇప్పటి నుంచే పక్కా స్కెచ్ వేస్తోంది. ప్రస్తుతం శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు వైట్ బాల్ క్రికెట్లో అత్యంత బలంగా ఉన్నప్పటికీ, సొంత గడ్డపై ఇండియాను ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని సౌతాఫ్రికా రాయబారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి నుంచే స్పెషల్ ట్రైనింగ్:
భారత్లోని సౌతాఫ్రికా హైకమిషనర్ ప్రొఫెసర్ అనిల్ సుక్లాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండియన్ టీమ్ ఫామ్లో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. కానీ తమ దేశం వేదికగా జరగబోయే 2027 వరల్డ్ కప్లో భారత్ను ఓడించడమే ధ్యేయంగా తమ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటి నుంచే ఆటగాళ్లకు ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్లు ప్రారంభించిందని బాంబ్ పేల్చారు.
పాత పగ తీర్చుకునేందుకు ప్రణాళికలు:
2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ శర్మ సేన చేతిలో కేవలం 7 పరుగుల తేడాతో ఓటమిపాలై ట్రోఫీని చేజార్చుకున్న ప్రొటీస్ జట్టు, ఈసారి ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని రగిలిపోతోంది. అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21, 2027 వరకు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
హెడ్ టు హెడ్లో ప్రొటీస్దే హవా:
వన్డే రికార్డుల విషయానికొస్తే భారత్పై సౌతాఫ్రికాదే పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటి వరకు 94 వన్డేల్లో తలపడగా సౌతాఫ్రికా 51 మ్యాచ్ల్లో విజయం సాధించగా, టీమిండియా 40 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ, తమ హోమ్ గ్రౌండ్లో టీమిండియాకు షాక్ ఇచ్చేందుకు సాఫరీ టీమ్ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి.
