అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లో పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం

అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లో పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం

 

  • కందుకూరు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
  • అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లో పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం
  • వెయ్యి కోట్ల విద్యుత్ బకాయిలను వడ్డీతో పాటు వసూలు చేయిస్తాం
  • ఇదే ఆఖరి పోరాటం.. కేసీఆర్​ను అడుగడుగునా అడ్డుకుని తీరుతమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ‘‘మండలానికి వంద మంది యువకులు మాతో రండి. ప్రజాకంటక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేద్దం. బీజేపీని అధికారంలోకి తీసుకొద్దం. అధికారంలోకి వచ్చిన 15 నిమిషాల్లోనే పాతబస్తీని జల్లెడ పట్టిస్తాం. వెయ్యి కోట్ల విద్యుత్ బకాయిలను వడ్డీతో పాటు వసూలు చేయిస్తాం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఇదే ఆఖరి పోరాటమని, ఇకపై కేసీఆర్ ను అడుగడుగునా అడ్డుకుని తీరుతామని, అందరం కలిసి ఏకమై టీఆర్ఎస్​ను గద్దె దించి తీరుతామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో టీడీపీ సీనియర్ నేతలు యెగ్గిడి సత్తయ్య, సురేందర్ గౌడ్ సహా వందలాది మంది నాయకులు సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. 

జనం నడ్డి విరుస్తున్న కేసీఆర్​ సర్కారు

కేసీఆర్ సర్కారు కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంచి జనం నడ్డి విరుస్తోందని సంజయ్ మండిపడ్డారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం మోపారని, మే నుంచి కరెంట్ బిల్లులు రెట్టింపు కాబోతున్నాయని చెప్పారు. ఓట్లు, సీట్లు కొనేందుకు సిద్ధంగా ఉన్న కేసీఆర్.. రైతులు పండించిన వడ్లు కొనబోమని చెబుతూ రైతులను నట్టేట ముంచుతున్నాడని ఆరోపించారు. ధాన్యం కొనేందుకు, డబ్బులు చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండికేస్తోందని చెప్పారు. రైతులు చనిపోయినా, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంటర్ విద్యార్థులు చనిపోయినా, బీజేపీ కార్యకర్తలపై మతోన్మాదులు దాడి చేసినా సీఎం కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న రెండో విడత పాదయాత్ర ప్రారంభించబోతున్నట్టు సంజయ్​ చెప్పారు.

కేంద్రాన్ని బద్నాం చేసే కుట్ర

కేంద్రాన్ని బద్నాం చేసి తెలంగాణ సెంటిమెంట్​ను మళ్లీ రగిలించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్​ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పోరాడుతోందన్నారు. సోమవారం ఎన్ఆర్ఐలతో నిర్వహించిన జూమ్ మీటింగ్​లో మాట్లాడారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని, కొట్లాడి తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా? అని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అవినీతిపై న్యాయపరంగా, క్షేత్ర స్థాయిలో పోరాటాలు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ అంతిమ లక్ష్యమని, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతామన్నారు. బీజేపీ చేస్తున్న ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.

బషీర్​బాగ్ నుంచి ప్రజా బ్యాలెట్ ప్రారంభం

రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ.. టీఆర్ఎస్ సర్కార్​కు వ్యతిరేకంగా సోమవారం బషీర్​బాగ్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా బ్యాలెట్ ప్రోగ్రామ్ చేపట్టారు.  సిటీ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా బ్యాలెట్​తో గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రతి ఇంటి నుంచి ప్రజాభిప్రాయాన్ని బీజేపీ సేకరించనుంది.