నెలరోజుల పాటు బీజేపీ ప్రచారం.. బహిరంగ సభలు, ర్యాలీలు

 నెలరోజుల పాటు బీజేపీ ప్రచారం.. బహిరంగ సభలు, ర్యాలీలు

కర్నాటకలో బీజేపీ దెబ్బతినడంతో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ సత్తా చాటేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని తొమ్మిదేళ్ల పాలనకు సంబంధించి నెల రోజులు  ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది.  మే 30 న ప్రారంభమై జూన్ 30 వరకు నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.

ర్యాలీలు,  బహిరంగ సభలు

దేశ వ్యాప్తంగా 396  లోక్ సభ నియోజకర్గాలను కవర్ చేస్తూ ర్యాలీలు, బహిరంగ సభల ద్వారా బీజేపీ విజయాలను. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా  ప్రచారం చేయాలని బీజేపీ పార్టీ నిర్ణయించింది.  ఈ సభల్లో కేంద్రమంత్రులు, జాతీయ నేతలు హాజరవుతారు.


మే 30న ర్యాలీతో మోడీ ప్రచారం
 

మే 30న ప్రధాని మోదీ భారీ ర్యాలీతో ప్రచారాన్ని ప్రారంభిస్తారు.  ఆ తరువాత రోజు మే 31న  దేశ వ్యాప్తంగా 51  ప్రాంతాల్లో  సీనియర్ నేతలు ర్యాలీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ , తెలంగాణా రాష్ట్రాల్లో త్వరలో  ఎన్నికలు జరుగుతాయి. ఈ రాష్ట్రాల్లో అనేక  ప్రదేశాల్లో బహిరంగ సభలను జరిగేలా ప్లాన్  చేస్తు్న్నారు.  బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించనున్నారు.    బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తారు.
 

మే 29న దేశవ్యాప్తంగా సమావేశాలు

మే 29న దేశవ్యాప్తంగా ఒకే సమయంలో  విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, ఇతర పార్టీల సీనియర్ నేతలు రాష్ట్ర రాజధానుల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నారు. మరో రెండు రోజుల్లో సోషల్ మీడియాద్వారా  ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయనున్నారు.

జూన్ 1 నుండి 22 వరకు...
 

మూడంచెల కార్యక్రమంలో భాగంగా జూన్ 1 నుండి 22 వరకు పలు  కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.   ప్రతి లోక్‌సభ నియోజకవర్గ కేంద్రంలో సమావేశాలు, సమ్మేళనాలు, సోషల్ మీడియాలో ప్రచారం , వికాస్ తీర్థం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.


జూన్ 21న యోగా దినోత్సవం


అసెంబ్లీ  నియోజకవర్గాల స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని సీనియర్ కార్యకర్తలతో  ఏడు ఫ్రంట్‌ల సంయుక్త సమావేశం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల సదస్సుతో పాటు జూన్ 21న యోగా దినోత్సవం  వంటి కార్యక్రమాలకు బీజేపీ అధిష్ఠానం ప్లాన్ చేస్తుంది.  

జూన్ 23న శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా దాదాపు 10 లక్షల బూత్‌లలోని పార్టీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. 

మిస్డ్ కాల్ ప్రచారం

జూన్ 20 నుండి 30 వరకు ఇంటింటికి ప్రచారం చేయాలని నిర్ణయించారు.   "మిస్డ్ కాల్ ప్రచారం" కూడా అమలు చేయబడుతుందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. ఈ కార్యక్రమాలకు పార్టీ ప్రచార కమిటీ ప్రచార బాధ్యతలు తీసుకోనుంది.  పర్యవేక్షించేందుకు కేంద్రమంత్రులు, మాజీ మంత్రులు, జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, సభ్యులు, సీనియర్ నేతలతో కూడిన ఇద్దరు సభ్యుల బృందాలను ఏర్పాటు చేశారు.