బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. అక్టోబర్ 22 నుంచి థియేటర్లు తెరవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. దాంతో ఇప్పటికే లేటైన సినిమాలన్నీ ఒక్కసారిగా రిలీజ్ డేట్స్ ప్రకటించేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి.
అక్షయ్ కుమార్ ఏ స్పీడ్లో సినిమాలు చేస్తుంటాడో తెలిసిందే. థియేటర్స్ తెరుచుకుంటాయనే కబురు రాగానే ఆయన నుంచి నాలుగు సినిమాలు విడుదలకు రెడీ అయిపోయాయి. ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయిన ‘సూర్యవంశీ’ దీపావళికి రిలీజ్ కానుంది. హిస్టారికల్ మూవీ ‘పృథ్విరాజ్’ వచ్చే యేడు జనవరి 21న, ‘బచ్చన్ పాండే’ మార్చ్ 4న, ‘రామసేతు’ వచ్చే యేడాది దీపావళికి రాబోతున్నాయి. ఇక కపిల్ దేవ్ వరల్డ్ కప్ సాధించిన కహానీతో తెరకెక్కిన ‘83’ని ఈ యేడు క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిద్ధాంత్ చతుర్వేది, శర్వరి జంటగా రూపొందుతున్న ‘బంటీ ఔర్ బబ్లీ’ సీక్వెల్ ఈ యేడు నవంబర్ 21న రానుంది. ఫస్ట్ పార్ట్లో లీడ్ రోల్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్, రాణీ ముఖర్జీ సీక్వెల్లో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కార్తికేయతో అజయ్ భూపతి తీసిన ‘ఆర్ఎక్స్ 100’ని సునీల్ శెట్టి కొడుకు అహాన్ హీరోగా హిందీలో రీమేక్ చేస్తున్నారు. తార సుతారియా హీరోయిన్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నారు. నాని నటించిన ‘జెర్సీ’ కూడా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ నటిస్తున్న ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక రణ్వీర్ సింగ్ ‘జయేష్భాయ్ జోర్దార్’ వచ్చే యేడు ఫిబ్రవరి 25న, రణ్బీర్ కపూర్ ‘షంషేరా’ మార్చ్ 18న రిలీజ్ కానున్నాయి. టైగర్ ష్రాఫ్ నటించిన ‘హీరోపంతీ 2’ మే 6కి ఫిక్సయ్యింది. ఇక ఆమిర్ఖాన్ ఎంతో ప్రెస్టీజియస్గా ప్లాన్ చేసిన ‘లాల్సింగ్ చద్ధా’ని వచ్చే యేడు వేలెంటైన్స్ డేకి తీసుకు రానున్నట్లు ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీల ‘భూల్ భులయ్యా 2’ మార్చ్ 25న రాబోతోంది. అజయ్ దేవగన్, రకుల్ ప్రీత్ సింగ్ల ‘మే డే’ ఏప్రిల్ 29కి ఖర్చీఫ్ వేసింది. ఈ వరుసలో ఇంకెన్ని సినిమాలు చేరబోతున్నాయో.!