
సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ చెప్పలేరు. అవకాశాలు రావడం ఒక ఎత్తైతే.. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం ఒక ఎత్తు. అంతేకాదు.. అవకాశాలు లేక దయనీయమైన జీవితాలు గడుపుతున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు సావి సిద్దు.
సావి సిద్దు బాలీవుడ్ ప్రేక్షకులకు చాల సుపరిచితమైన పేరు. బ్లాక్ ఫ్రైడే, గులాల్, పటియాలా హౌస్ వంటి చాలా సూపర్ హిట్ చిత్రాల్లో
నటించాడు. అక్షయ్ కుమార్, కేకే మీనన్, అనురాగ్ కశ్యప్, నిఖిల్ అద్వాణీ వంటి చాలా మంది స్టార్స్ తో పని చేశారు. కానీ ప్రస్తుతం ఆయన వాచ్మెన్గా పని చేస్తూ దయనీయమైన స్థితిలో ఉన్నారు. సినిమాల్లో అవకాశాలు రాకే ఆయన ఇలా మారిపోయారట.
ఇటీవల ఓ ఛానెల్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా సావి సిద్దు మాట్లాడుతూ.. నా భార్య మరణం నా జీవితాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. దాని నుండి బయటకు రాకముందే.. అమ్మానాన్న కూడా చనిపోయారు. ఐనవాళ్ళందరూ దూరమై ఒంటరిగా మిగిలిపోయాను. ఈ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఇండస్ట్రీ నుండి అవకాశాలు రాలేదు. ఖాళీగా కూర్చుంటే బ్రతకడం ఎలా.. అందుకని వాచ్మెన్గా పనిచేస్తున్నాను.. అంటూ తన పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు సావి సిద్దు. ప్రస్తుతం ఆయనకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.