హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్ల బకాయిల విషయంలో మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలు మిల్లర్లనుంచి వెంటనే వసూలు చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మిల్లర్లనుంచి ధాన్యం బకాయిలు వసూళ్లకు విధివిధానాలు రూపొందించాలని అధికారులను కోరారు. బుధవారం (ఆగస్టు12) పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ధాన్యం బకాయిలపై సమీక్ష నిర్వహించారు.
ధాన్యం బకాయిల విషయంలో గత ప్రభుత్వం మిల్లర్లపట్ల ఉదారంగా వ్యవహరించిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో వేలకోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. ఆ తప్పును తిరిగి తమ ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి ఉంది.. అన్ని బకాయిలు వసూలు చేసేందుకు ఓ ప్రణాళిక రూపొందించాలని కోరారు. మంత్రివర్గ ఉప సంఘం పరిశీళనఅనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మొండి బకాయిలు ఉన్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వకుండా మహిళా సంఘాలకు కేటాయించి మిల్లింగ్ బాధ్యతలు అప్పజెప్పుతామన్నారు.
మరోవైపు ప్రతి సీజన్లో ధాన్యం నిల్వలకు ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు సీఎం. ధాన్యం భారీ వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాలో సైల బ్యాగ్ నిర్మాణాలను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టాలని ఆదేశించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగుల నిర్మాణానికి నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమిని కేటాయిస్తామన్నారు సీఎం. ఉపాధిహామీ పథకం కింద ప్లాట్ ఫాంల నిర్మాణానికి ఉన్న అవకాశాన్నివినియోగించుకొని విశాలైమన ప్లాట్ ఫాంలు నిర్మించి జర్మన్ టెంట్లతో ధాన్యం నిల్వ చేయడంపై పరిశీలించాలన్నారు.
మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించడంపై మంత్రి సీతక్క హర్షం
ధాన్యం మిల్లింగ్ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం పై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంగొప్పదని కొనియాడారు. మహిళా సాధికారతకు సీఎం నిర్ణయం మరో ముందడుగు అని సీఎంకు కృతజ్ణతలు తెలిపారు. మహిళా సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు మరింత మెరుగవుతాయన్నారు మంత్రి సీతక్క.
