ముంబై: టీమిండియా మాజీ బ్యాట్స్మన్ బ్రిజేశ్ పటేల్.. బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కొత్త సెక్రటరీగా బాధ్యతలు చేపట్టే చాన్స్ ఉంది. ట్రెజరర్గా అరుణ్ దుమాల్, జాయింట్ సెక్రటరీగా దెబాజిత్ సైకియాను ఎన్నుకునే అవకాశాలున్నాయి. ప్రెసిడెంట్ పోస్ట్ కోసం మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా రేస్లో ఉన్నా.. ఇటీవల జరిగిన అనధికార సమావేశంలో చాలా రాష్ట్ర సంఘాలు పటేల్ వైపు మొగ్గినట్లు సమాచారం.
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించాడని తెలుస్తున్నది. వాస్తవానికి అధ్యక్ష పదవి కోసం ముందు నుంచి గంగూలీ పేరునే ప్రతిపాదించినా.. శనివారం అమిత్ షాతో జరిగిన సమావేశం తర్వాత పటేల్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.


