- డ్రైవర్ అరెస్ట్
- లండన్ దగ్గర గుర్తించిన యూకే పోలీసులు
లండన్ : ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 39 మృతదేహాలను లండన్ దగ్గర్లోని లారీ కంటైనర్లో యూకే పోలీసులు బుధవారం గుర్తించారు. ఈ కంటైనర్ బల్గేరియా నుంచి వస్తున్నట్టు పోలీసులు చెప్పారు. నార్తర్న్ ఐర్లాండ్కు చెందిన 25 ఏళ్ల ట్రక్ కంటేనర్ డ్రైవర్ని ఎస్సెక్స్ పోలీసులు అరెస్టుచేశారు.
గ్రేస్లోని ఈస్టర్న్ ఎవెన్యూ వాటర్ గ్రేడ్ ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా మృతదేహాలు బయటపడ్డాయి. బల్గేరియా నుంచి హోలీహెడ్ మీదుగా ఈ ట్రక్ శనివారం ఇంగ్లాండ్లోకి ప్రవేశించింది. చనిపోయినవారిలో 38 మంది పెద్దలు, ఒక టీనేజర్ ఉన్నట్టు పోలీసులు చెప్పారు. చనిపోయినవారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు ఎస్సెక్స్ పోలీసు చీఫ్ సూపరింటెండెంట్ ఆండ్రూ మారినర్ చెప్పారు.
‘‘ఇంత మంది చనిపోవడం చాలా బాధాకరం. ఏం జరిగిందన్నదానిపై దర్యాప్తు మొదలుపెట్టాం. నిజానిజాలు తెలియడానికి చాలా టైం పట్టొచ్చు’’ అని పోలీస్ చీఫ్ వివరించారు.
ప్రధాని బోరిస్ జాన్సస్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ఈ ఘోరమైన సంఘటనతో ఎంతో ఆందోళనకు గురయ్యానని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ఈ ఘటనపై రెగ్యులర్ అప్డేట్స్ నాకు వస్తున్నాయి. ఎస్సెక్స్ పోలీసులతో హోం డిపార్ట్మెంట్ ఆఫీసు టచ్లో ఉంది’’ అని ప్రధాని అన్నారు.
ఇంతకుముందు ఘటనలు
- ఇంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
- 2014లో షిప్పింగ్ కంటేనర్లో వచ్చిన 34 మంది ఆఫ్గాన్ సిక్కులు డీహైడ్రేషన్, గాలిలేక బాగా ఇబ్బందిపడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. బెల్జియం నుంచి సముద్రం దాటుతుండగా ఈ ఘటన జరిగింది.
- డోవర్లో లారీ వెనకభాగంలో ఉన్న 58 మంది చైనా ఇమ్మిగ్రెంట్స్ ఊపిరాడక 2000లో చనిపోయారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనతో సంబంధమున్న డచ్ లారీ డ్రైవర్ను 2001లో జైల్లో పెట్టారు.

