
ఎమ్మెల్సీ కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలకు నిరసనగా హైదరాబాద్ లోని బస్ భవన్ దగ్గర బైఠాయించి జాగృతి కార్యకర్తలతో కవిత నిరసన తెలిపారు. పెంచిన బస్ పాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కవిత. బస్ చార్జీలు తగ్గించే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. పోలీసులు జాగృతి కార్యకర్తలను, వాహనాల్లో పీఎస్ కు తరలించారు. కవితను కంచన్ బాగ్ పీఎస్ కు తరలించారు పోలీసులు.
తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ రేట్లను జూన్ 9న పెంచింది. సాధారణ ప్రజల తీసుకునే బస్ పాసులతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను చార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. 20 శాతం పైగా బస్ పాస్ రేట్లను ఆర్టీసీ పెంచింది. 1150 రూపాయలుగా ఉన్న ఆర్డినరీ పాస్ ధర పెంపు తర్వాత 1400 రూపాయలకు చేరింది.
1300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ 1600 రూపాయలకు చేరింది. 1450 రూపాయలుగా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ 1800 రూపాయలైంది. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను కూడా ఆర్టీసీ పెంచింది. హైదరాబాద్ లో ఇటీవలే మెట్రో రైలు టికెట్ ఛార్జీలు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. ఇలా.. బస్ పాస్ రేట్లు, మెట్రో టికెట్ రేట్లు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.