
కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహా ధర్నా చేస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మే 31న బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జై తెలంగాణ, జై జాగృతి అంటూ ప్రసంగం మొదలు పెట్టిన కవిత.. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులివ్వడమంటే..యావత్ తెలంగాణకు నోటీసులివ్వడమేనని చెప్పారు .అది కాళేశ్వరం కమిషనా..?లేక కాంగ్రెస్ కమిషనా.? అని ఫైర్ అయ్యారు కవిత. కేసీఆర్ కు బీఆర్ఎస్,జాగృతి రెండు కళ్ల లాంటివన్న కవిత..ఆయన మీద ఈగ కూడా వాళనివ్వబోమన్నారు.
రాజీవ్ యువ వికాసానికి ఆయన పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు కవిత . తెలంగాణ యువ వికాసంతో కార్యక్రమాలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్2న రాష్ట్ర ఆవిర్భావం రోజు నాడైనా రేవంత్ అమరులకు నివాళి అర్పించి జై తెలంగాణ అని అనాలన్నారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతున్నా రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. గోదారి నీళ్లు తరలించుకుపోతున్నా బీజేపీ ఎంపీలు ఎందుకు ప్రశ్నిండం లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని.. బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించాలన్నారు. లేకపోతే రైల్ రోకో వంటి కార్యక్రమాలు చేపడుతామని కవిత అన్నారు.
ప్రతి ఉద్యమంలోనూ తెలంగాణ జాగృతి భాగమైందన్నారు కవిత. 18 ఏళ్ల క్రితం జాగృతి సంస్థను ప్రారంభించామన్నారు.. కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ జాగృతి పుట్టిందన్నారు. తాము ఉద్యమాలు చేసిన నిమిషాల్లోనే ప్రభుత్వాల నుంచి జీవోలు వచ్చాయన్నారు.