జగిత్యాల జిల్లాకు చెందిన బీటెక్ స్టూడెంట్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. రాహుల్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మే 27న సైదాబాద్ లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్ నుండి అదృశ్యమైన అంకం రాహుల్ ఏపీ ప్రకాశం జిల్లా సింగరాయి కొండ దగ్గర ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు పోలీసులు. కాలేజీలో గొడవ కారణంగా కాచిగూడ మీదుగా ట్రైన్ లో వెళ్ళిపోయాడు రాహుల్.
రాహుల్ తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కాచిగూడ పోలీసులు సింగరాయకొండ దగ్గర బావిలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసుపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు పది రోజుల తరువాతరాహుల్ మృతదేహాన్ని గుర్తించారు.ఏపీ పోలీసులు సమాచారం అందించడంతో సింగరాయి కొండకు వెళ్లారు మృతుడి కుటుంబ సభ్యులు, కాచిగూడ పోలీసులు.
రాహుల్(21) హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలోని లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. మే 27న ఉదయం కాచిగూడ టూరిస్ట్ జంక్షన్ వద్ద తన స్నేహితుడి బైక్ నుంచి దిగిన రాహుల్, స్నేహితులతో బయటకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లాడు. అనంతరం హాస్టల్కు గానీ, ఇంటికి గానీ తిరిగి రాలేదు.
పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు, రాహుల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి షబరీ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణించినట్లు గుర్తించారు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఏపీలోని సింగరాయకొండ దగ్గర బావిలో రాహుల్ మృతదేహాన్ని గుర్తించారు.
