ఏపీలోని విశాఖలో స్నేహితుల దినోత్సవం రోజున తీవ్ర విషాదం నెలకొంది. స్నేహితుల దినోత్సవాన్ని సరదాగా గడిపేందుకు ఫ్రెండ్స్ తో వచ్చిన యువతీయువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఆదివారం ( ఆగస్టు 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... విశాఖపట్నం గాజువాక పాత గంగవరం బీచ్ లో యువతి, యువకుడు గల్లంతయ్యారు. గల్లంతైనవారు నీతూ, రాముగా గుర్తించారు.
ఫ్రెండ్స్ తో కలిసి ఫోటోలు దిగుతుండగా అలలు ఉదృతంగా రావడంతో నీతూ కొట్టుకుపోయిందని.. ఆమెను కాపాడేందుకు రాము ప్రయత్నించగా... అతడు కూడా గల్లంతైనట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
విశాఖ బీచ్ లో ఇటీవల కూడా ఇద్దరు గల్లంతవ్వడంతో సెక్యూరిటీ అప్రమత్తమై వారిని రక్షించారు. ఏపీలో విశాఖ బీచ్ తో పాటు బాపట్ల సహా ఇతర బీచ్ లలో ప్రస్తుతం అలలు ఉదృతంగా ఎగసి పడుతున్నాయి. సముద్రంలో అలలు ఎగసిపడుతున్న క్రమంలో బీచ్ కు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
