చుట్టుముట్టిన మంటలు

చుట్టుముట్టిన మంటలు

    బీచ్​లోకి జనం, టూరిస్టుల పరుగులు

    అక్కడే తలదాచుకున్న 4 వేల మంది

    రంగంలోకి ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​

    బూడిద, పొగతో జనం ఉక్కిరిబిక్కిరి

    ఆస్ట్రేలియా బుష్​ఫైర్స్​కు తోడుగా గాలులు

పాత సంవత్సరానికి మంటలతో ఆస్ట్రేలియా గుడ్​బై చెబుతోంది. కొత్త సంవత్సరంలోకి అదే మంటలతో అడుగుపెడుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు పెను గాలుల ధాటికి బుష్​ఫైర్స్​ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాకుతున్నాయి. సిడ్నీ, న్యూసౌత్​వేల్స్​కే పరిమితమైన మంటలు మంగళవారం మెల్​బోర్న్​, విక్టోరియా రాష్ట్రాలకూ పాకాయి. విక్టోరియాలోని మలాకూట, న్యూసౌత్​వేల్స్​లోని బాటెమన్స్​ బేలో బుష్​ఫైర్స్​ ధాటికి టూరిస్టులు, స్థానికులు బీచ్​లోకి పరుగులు తీశారు. చుట్టుముట్టిన మంటలతో బయటకు వచ్చే దారి లేక 4 వేల మందికిపైగా బీచ్​లోనే ఉండిపోయారు. వందలాది ఇళ్లు కాలి బుగ్గయ్యాయి. ఉదయం 8 గంటలకు చిన్నచిన్నగా మొదలైన మంటలు కాసేపటికే పెను గాలులు తోడవడంతో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. దీంతో ఆకాశమంతా ఎర్రగా మారిపోయింది.

బాటెమన్స్​ బేలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తండ్రీకొడుకులుగా అధికారులు గుర్తించారు. దీంతో న్యూసౌత్​వేల్స్​లో మంటలకు చనిపోయిన వారి సంఖ్య 12కు పెరిగింది. విక్టోరియాలో నలుగురు, న్యూసౌత్​వేల్స్​లో మరొకరు మిస్సయినట్టు అధికారులు తెలిపారు.మంటల వల్ల బూడిద ఆయా ప్రాంతాలను కప్పేసింది. ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. వాతావరణాన్ని పొగ కమ్మేసింది. దీంతో జనం ఆ పొగ నుంచి కాపాడుకునేందుకు ఇళ్లలోనే ఉండిపోతున్నారు. మరికొందరు ఇళ్లు వదిలి భద్రమైన చోటుకు తరలిపోతున్నారు. ఇంకొందరు బంకర్లలో చేరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. సూపర్​మార్కెట్లలో జనం క్యూ కడుతున్నారు. సరుకులను తీసుకొచ్చుకుంటున్నారు. మంటలతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే ఆస్ట్రేలియా రక్షణ దళాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లాయి. ఎయిర్​ఫోర్స్​, నేవీ, ఆర్మీ రంగంలోకి దిగాయి. అమెరికా, కెనడా, న్యూజీలాండ్​లూ ఫైర్​ఫైటర్స్​ను పంపాయి.

విక్టోరియాలోని ఈస్ట్​ జిప్స్​ల్యాండ్​లో 2 లక్షల హెక్టార్ల మేర అడవులు బుగ్గయ్యాయి.

    ఇప్పటిదాకా ఏడు ఎమర్జెన్సీ వార్నింగ్​ అలర్ట్​లు ఇచ్చారు.

    విక్టోరియాలో చాలా ఇళ్లు తగలబడిపోయాయి. అయితే, ఇప్పుడప్పుడే ఎన్ని ఇళ్లు తగలబడ్డాయన్నది, ఎంత ఆస్తి నష్టం జరిగిందన్నది చెప్పలేమని అధికారులు అంటున్నారు.

    మంటలకు తోడు కరెంట్​ కోతలూ జనాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. నెట్​ సర్వీసులూ ఆగిపోయాయి.

    టాంబో క్రాసింగ్​, మలాకూట, కాన్​ రివర్​. టోంగి క్రీక్​, మౌంట్​ రేమండ్​, మార్లో, ఆర్బోస్ట్​, వేగరా, మౌంట్​ నోవా నోవాల్లో మొబైల్​ సర్వీసులు బంద్​ అయ్యాయి.

    మంటలు కొంచెం తగ్గినా, గాలులు వీచే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో మళ్లీ మంటలు పెరిగే ముప్పుందని అంటున్నారు.

   ఆస్ట్రేలియా ప్రధాని డేనియల్​ ఆండ్రూస్​ అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.