కోల్కతా: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పొరెల్కు కలకత్తా హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఓ మెడికల్ స్టూడెంట్పై అత్యాచారం, బ్లాక్మెయిలింగ్ ఆరోపణల కేసులో అభిషేక్ పొరెల్ను తక్షణమే అరెస్ట్ చేయాలని పశ్చిమ బెంగాల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అలాగే, బాధితురాలి గోప్యతను కాపాడేందుకు అభిషేక్ ఫోన్, ల్యాప్ ట్యాప్ వంటి అన్నీ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని క్రికెటర్ అభిషేక్ పొరెల్పై పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా మగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అభిషేక్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువతి ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని అడిగితే.. తమ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్లో లీక్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అభిషేక్ పొరెల్పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు వంటి తీవ్రమైన నాన్-బెయిలబుల్ సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగానే.. బాధితురాలు కలకత్తా హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కేసులో సరైన దర్యాప్తు జరగాలని.. అలాగే నిందితుడి వద్ద ఉన్న తమ వ్యక్తిగత/రహస్య ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకునేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బాధితురాలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సోమవారం (జులై 20) విచారణ చేపట్టిన జస్టిస్ సౌగత్ భట్టాచార్య ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.
నిందితుడు అభిషేక్ పోరెల్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే, బాధితురాలి అభ్యర్థన మేరకు నిందితుడి మొబైల్, ల్యాప్ ట్యాప్ వంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసులో తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2026, ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
