
ప్రముఖ నటి సోనాలీ బింద్రే 2018లో క్యాన్సర్ బారినపడి, ఆ తర్వాత అమెరికాలో చికిత్స అనంతరం ప్రస్తుతం ఆమె మామూలు స్థితికి వచ్చారు. అయితే గతంలో న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆసుపత్రిని తాజాగా ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ.. ఇప్పుడు వచ్చిన మార్పులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఆసుపత్రిని తిరిగి సందర్శించిన అనుభవాన్ని "బిట్టర్స్వీట్ పోస్ట్"లో పంచుకున్నారు సోనాలి బింద్రే. "ఇదే కుర్చీలో కూర్చొని వస్తూ పోయే రోగులను చూస్తూంటే ఏదో కలలా అనిపించింది. నేను కూడా ఇక్కడున్న వారి పరిస్థితులను అనుభవించాను కదా అన్న విషయం గుర్తుకువచ్చి ఎంతో అనుభూతి చెందాను. అదే కీమోథెరపీ సూట్.. అదే వెయిటింగ్ రూం... కానీ కొత్త ముఖాలు కనిపిస్తున్నట్టు అనిపించింది. మీరేమీ భాదపడొద్దు. జీవితంపై మమకారాన్ని పెంచుకోండి.బ్రతుకుపై దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండండి అని వాళ్లతో ఒక్కసారిగా గట్టిగా చెబుతున్నట్టు అనిపించింది. నిన్నటి వరకు క్యాన్సర్ రోగిగా ఉన్న నేను కోలుకుని ఈ రోజు మామూలు వ్యక్తిలా మళ్లీ ఇవాళ ఆసుపత్రికి వచ్చాను. ఇది చాలా చేదు, మధురమైన, ఉద్వేగభరితమైన రోజుగా భావిస్తున్నాను. ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ, నా కొడుకు కళ్లలోకి చూశాను. సూర్యకాంతి నా ముఖంపై పడుతుండగా, మళ్లీ కొత్త జీవితాన్ని నాకిచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను" అంటూ సోనాలి బింద్రే ఓ ఎమోషనల్ పోస్ట్ ను తన ఇన్సాస్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. దీంతో పాటు తన భర్త గోల్డీ బెహల్ తో కలిసి ఆసుపత్రిలో ఉన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.
ఇదిలా ఉండగా పలు తెలుగు, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న సోనాలి బింద్రే... ఇండియాస్ బెస్ట్ డ్రామెబాజ్ వంటి రియాలిటీ షోలలో మెరిసింది. ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్లోనూ న్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది.