రీ ఎంట్రీ ఎప్పుడో చెప్పలేను

రీ ఎంట్రీ ఎప్పుడో చెప్పలేను

హైదరాబాద్‌‌, వెలుగు: గాయం కారణంగా ఆటకు దూరమైన ఇండియా స్టార్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ తాను తిరిగి ఎప్పుడు జట్టులోకి వస్తానో స్పష్టంగా చెప్పలేనని అంటున్నాడు. తన గాయం విషయంలో నేషనల్‌‌ క్రికెట్‌‌ అకాడమీని నిందించాలనుకోవడం లేదని చెప్పాడు. ‘ఎన్‌‌సీఏపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నా ఆటతో పాటు గాయం నుంచి ఎలా కోలుకోవాలన్నదానిపై దృష్టి పెట్టా. వీలైనంత త్వరగా ఫుల్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించాలన్నదే నా లక్ష్యం. ఇంకా డాక్టర్‌‌ను కలవలేదు కాబట్టి ఫలనా టైమ్‌‌లోగా ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తానని చెప్పలేను’అని ఆదివారం హైదరాబాద్‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భువీ తెలిపాడు . గాయాలను పక్కనబెడితే ఈ ఏడాది తనతో పాటు ఇండియా క్రికెట్‌‌కు కలిసొచ్చిందని భువనేశ్వర్‌‌ చెప్పాడు. ‘ఇండియా క్రికెట్‌‌కు ఇది గ్రేట్‌‌ ఇయర్‌‌. ఈ సీజన్‌‌లో దాదాపు అన్ని సిరీస్‌‌ల్లో మనం గెలిచాం. అయితే, వరల్డ్‌‌ కప్‌‌ నెగ్గలేకపోవడం ఎప్పటికీ బాధ కలిగించేదే. కానీ, జీవితంలో ఎత్తుపల్లాలు సహజం’అన్నాడు