
న్యూఢిల్లీ, వెలుగు: కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జరిగిన పర్యావరణ నష్టంపై న్యాయవాది ఇమ్మనేని రామారావు దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పరిగణనలోకి తీసుకుంది. పర్యావరణ నష్టాన్ని అంచనా వేయకుండ 27 ఎకరాల సహజ సరస్సు, 134.28 ఎకరాల షీట్ రాక్స్, 2.33 ఎకరాల కుంటను ప్రభుత్వం నాశనం చేసిందని రామారావు ఈ ఏడాది ఏప్రిల్ 2న ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
ఈ చర్యల వల్ల అంతరించిపోయే జాతులైన నక్షత్ర తాబేళ్లు, జింకలు, నెమళ్లు, ఇతర జీవజాతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. కేసు నంబర్ 823/36/9/2025తో ఈ వ్యవహారాన్ని నమోదు చేసినట్లు గురువారం ఇమ్మనేని రామారావుకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించింది. ఈ కేసుపై భవిష్యత్తులో వాదనలు వినిపించవచ్చని కమిషన్ పేర్కొన్నట్లు రామారావు వెల్లడించారు.