
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ రేపు విచారించనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటి దగ్గర కొన్ని పోస్టర్లు వెలిశాయి. వీరుని (కుమార్తె) కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి. అంతకు ముందు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మరికొందరిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని సీబీఐకి కవిత లేఖ రాశారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వస్తాకు ఈ లెటర్పంపారు.ఈ కేసులో కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్న తన విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఈ - మెయిల్ అందిందని కవిత తెలిపారు.
అయితే సీబీఐ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించానని, అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు ఎక్కడా లేదని అన్నారు. తనకు సీఆర్పీసీ 160 కింద సీబీఐ పంపిన నోటీసులకు ఈ నెల ఆరో తేదీన (మంగళవారం) తన నివాసంలో అందుబాటులో ఉంటానని ముందు వెల్లడించానని, అయితే.. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల ఆరో తేదీన తాను సీబీఐ అధికారులను కలువలేకపోతున్నానని తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజు హైదరాబాద్లోని తన నివాసంలో వివరణ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటానని సీబీఐకి లేఖలో తెలియజేశారు. పైన పేర్కొన్న తేదీల్లో సీబీఐ అధికారులకు అనువైన ఏదో ఒక రోజు సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.