అనుమానాస్పదంగా సెంట్రింగ్​ కార్మికుడు మృతి

అనుమానాస్పదంగా సెంట్రింగ్​ కార్మికుడు మృతి
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: అనుమానాస్పద స్థితిలో సెట్రింగ్​ కార్మికుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. వికారాబాద్​జిల్లా పరిగికి చెందిన ఎండీ బాబా(31), అతని సోదరుడు సద్దాం మూడు నెలల కిందట ఇబ్రహీంపట్నంకు వచ్చి సెంట్రింగ్​ పనులు చేస్తూ జీవిస్తున్నారు.  సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఎండీ బాబా(31)  తిరిగి ఇంటికి రాకపోగా అతని సోదరుడు స్థానికంగా వెతికినా ఆచూకీ దొరకలేదు. 

మంగళవారం ఉదయం మంచాలకు వెళ్లే రోడ్డులో తిరుమల బ్యాంగిల్​స్టోర్​ ముందు ఎండీ బాబా మరణించి పడి ఉన్నాడు. మల్లేశ్, లక్ష్మణ్​ అనే ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగి నెట్టివేయగా కిందపడడంతో అతడు మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి సోదరుడు సద్దాం ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేశారు.