చిన్న చిన్న బిజినెస్ల కోసం రెండో ప్యాకేజి!
బ్యాంకులకు రీక్యాపిటల్, రియల్టీ సెక్టార్కు రాయితీలు
ప్యాకేజి విలువ సుమారుగా రూ. 2 లక్షల కోట్లు
జూన్లో ఆర్బీఐ రేట్ కట్: బ్యాంక్ ఆఫ్ అమెరికా
ముంబై: ప్రభుత్వం రెండో స్టిమ్యులస్ ప్యాకేజిని ప్రకటించడానికి సిద్ధమవుతోందని బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీఓఎఫ్ఏ) సెక్యురిటీస్ ఓ రిపోర్ట్ లో పేర్కొంది. గతంలో ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజి మాదిరే ఈ ప్యాకేజి కూడా ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్(ఎంఎస్ఎంఈ)లు చెల్లిస్తున్న వడ్డీలో కొంత భాగాన్ని ప్రభుత్వం భరించనుందని పేర్కొంది. దీంతోపాటు రియల్టీ సెక్టార్ కోసం రాయితీలను, ప్రభుత్వ బ్యాంకులకు రీక్యాపిటల్ను ఈ ప్యాకేజి ద్వారా అందజేయనుందని అంచనావేసింది. గత నెలలో ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజిని ప్రకటించింది. కాగా జీడీపీలో 0.3 శాతాన్ని రెండో స్టిమ్యులస్ ప్యాకేజి కోసం ఫైనాన్స్ మినిస్ట్రీ ప్రకటిస్తుందని, గరిష్టంగా ఇది జీడీపీలో 0.35 శాతంగా ఉంటుందని బీఓఎఫ్ఏ సెక్యురిటీస్ ఎకనామిస్ట్లు తెలిపారు. ఏడాది పాటు స్మాల్బిజినెస్ల బకాయిలపై వడ్డీని 2 శాతంవరకు ప్రభుత్వం భరించే అవకాశం ఉందని, ఇది జీడీపీలో 0.1 శాతానికి సమానమని చెప్పారు. బ్యాడ్ లోన్స్ పెరుగుతుండడం వలన బ్యాంకుల క్యాపిటల్ తరిగిపోతోందని, బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కోసం జీడీపీలో 0.75 శాతాన్ని ప్రకటించాలని బీఎఫ్ఓఏ సెక్యురిటీస్ ప్రభుత్వానికి సలహాయిచ్చింది. గత నెలలో ప్రకటించిన స్టిమ్యులస్ ప్యాకేజితో పాటు, ఈ ప్యాకేజి వలన ఆర్థిక సంవత్సరం 2021లో ద్రవ్యలోటు జీడీపీలో 4.8 శాతానికి చేరుకుంటుందని అంచనావేసింది. కాగా ఇది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న దానికంటే 1.30 శాతం ఎక్కువ. జూన్, అక్టోబర్లో వడ్డీ రేట్లను 0.25 శాతం వరకు ఆర్బీఐ తగ్గిస్తుందని బీఓఎఫ్ఏ సెక్యురిటీస్ అభిప్రాయపడింది. గత నెలలో ఆర్బీఐ 0.75 శాతం వరకు వడ్డీ రేట్ను కట్చేసిన విషయం తెలిసిందే. జూన్క్వార్టర్లో జీడీపీ గ్రోత్ రేట్ 2.5 శాతానికి పడిపోతుందని ఈ సంస్థ అంచనావేసింది.
ఎంఎస్ఎంఈల కోసం రూ. 75,000 కోట్లతో ఫండ్
ప్రభుత్వం స్మాల్, మీడియం ఇండస్ట్రీల కోసం రూ. 50,000-రూ. 75, 000 కోట్ల విలువైన ఫండ్ను ఏర్పాటు చేయనుందని సంబంధిత అధికారులు తెలిపారు. లేబర్ ఎక్కువగా ఉన్న స్మాల్, మీడియం యూనిట్లకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వనుందని చెప్పారు. ఈ ఫండ్ను స్టిమ్యులస్ ప్యాకేజిలో భాగంగా ప్రభుత్వం ప్రకటించనుందని తెలిపారు. ఈ ఫండ్లో కొంత భాగాన్ని పెట్రోల్, డీజిల్ వంటి వాటిపై సెస్ను విధించడం ద్వారా సమీకరించనుందని, మిగిలిన భాగాన్ని బడ్జెట్ నిధుల ద్వారా అందించనుందని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు తక్కువ వడ్డీలోనే నిధులను అందుబాటులో ఉంచడమే ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశమని ఈ అధికారులు చెప్పారు. దీంతో ఈ కంపెనీల క్యాపిటల్ అవసరాలు తీరుతాయని, తమ పెండింగ్ ఆర్డర్లను పూర్తి చేసి పేమెంట్లను రిసీవ్ చేసుకోగలుగుతాయని అన్నారు. ఇతర స్ట్రెస్డ్ ఇండస్ట్రీలు, ఎక్స్పోర్టర్స్కోసం కూడా ప్రభుత్వం స్టిమ్యులస్ను ప్రకటించనుందని సంబంధిత అధికారులు తెలిపారు. రెండో స్టిమ్యులస్ ప్యాకేజిని ప్రభుత్వం సిద్ధం చేస్తోందని అన్నారు. లాక్డౌన్ తర్వాత ఈ ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉందని ఎకానమిస్ట్ రామ్ సింగ్ అన్నారు. ఎకానమి తిరిగి గాడిలో పడేందుకు ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజిని ప్రకటించాలని అడిగామని ఫిక్కి తెలిపింది. జీడీపీలో 2-3 శాతం వరకు స్టిమ్యులస్ ప్యాకేజి ఉంటుందని సీఐఐ అంచనావేసింది.
For More News..