విమాన సంస్థలకు బిగ్ రిలీఫ్: 3 నెలలు ల్యాండింగ్ ఛార్జీల్లో రాయితీలు.. టిక్కెట్ రేట్లు తగ్గుతాయా..?

విమాన సంస్థలకు బిగ్ రిలీఫ్: 3 నెలలు ల్యాండింగ్ ఛార్జీల్లో రాయితీలు.. టిక్కెట్ రేట్లు తగ్గుతాయా..?

ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం మేర తగ్గించాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుండగా.. రాబోయే 3 నెలల పాటు ఈ రాయితీ బెనిఫిట్ కొనసాగనుంది. 

విమానయాన కంపెనీలకు ఈ నిర్ణయం ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణాలపై నిషేధం ఉండటం.. దానికి తోడు ఇరాన్ యుద్ధం వల్ల ఏవియేషన్ ఫ్యూయెల్ ఖర్చులు పెరగడంతో విమాన సంస్థలను కుదిపేస్తున్నాయి. విమాన సంస్థల మొత్తం వ్యయంలో ఇంధనం, సిబ్బంది తర్వాత ఎయిర్‌పోర్ట్ ఛార్జీలే మూడో అతిపెద్ద ఖర్చుగా ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ వెల్లడించింది. ఇప్పుడు ఈ ఛార్జీలు తగ్గడం వల్ల ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి దిగ్గజ సంస్థలకు నిర్వహణ భారం భారీగా తగ్గుతుంది. ఈ ఆయా కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

సామాన్య ప్రయాణికుల విషయానికి వస్తే.. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల టికెట్ ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. యుద్ధం వల్ల విమాన ప్రయాణం సామాన్యులకు భారంగా మారుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ జోక్యం వల్ల విమాన ఛార్జీలు భారీగా పెరగకుండా కట్టడి జరగొచ్చు. ఇది పరోక్షంగా ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటును కలిగిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ వ్యూహాత్మక చర్య అటు విమానయాన రంగాన్ని ఆదుకోవడమే కాకుండా.. సామాన్యుడిపై అదనపు భారం పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మెుత్తానికి ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జీల్లో తగ్గింపులు పెరిగిన ఖర్చులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విమానయాన సంస్థలకు ఊరటను మాత్రమే ఇవ్వనుందని.. నేరుగా ప్రయాణికులకు రిలీఫ్ ఇవ్వబోదని తెలుస్తోంది. అయితే ఈ చర్య విమాన ప్రయాణ ఛార్జీలు మరింతగా కంపెనీలు పెంచకుండా సపోర్ట్ గా నిలుస్తుందని ఏవియేషన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ తగ్గింపులను వినియోగదారులకు కంపెనీలు పాసాన్ చేసి టిక్కెట్ రేట్లను తగ్గిస్తాయా అనే వేచి చూడాల్సిందే.